మద్యం అలవాటుపై జాన్వీ వ్యాఖ్యల వక్రీకరణ: మీడియా సంస్థలపై నటి టీమ్ ఫైర్!
- జాన్వీకి మద్యం అలవాటు ఉందనే విధంగా కథనాలు
- మద్యంపై అవగాహన కల్పించేందుకే జాన్వి ఆ కార్యక్రమంలో భాగస్వామి అయిందన్న టీమ్
- అవాస్తవాలను ప్రచారం చేయవద్దని హితవు
యువ నటి జాన్వీ కపూర్ ఇటీవల ఒక పాడ్క్యాస్ట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్న విషయాలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా వక్రీకరించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం వ్యసనంపై అవగాహన కల్పించే 'ఆఫ్ ది రాక్స్', 'అమహా' సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో జాన్వీ పాల్గొని, జీవితంలోని ఒడిదుడుకులపై మాట్లాడారు. అయితే, ఆమె మాటలను సందర్భం లేకుండా ప్రచారం చేస్తూ జాన్వీకి మద్యం అలవాటు ఉందనే అర్థం వచ్చేలా కథనాలు రాయడంపై ఆమె వ్యక్తిగత టీమ్ స్పందించింది.
ఆయా కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, జాన్వీ కేవలం అవగాహన కోసమే ఆ కార్యక్రమంలో భాగమయ్యారని సదరు పాడ్క్యాస్ట్ సంస్థలు కూడా స్పష్టం చేశాయని టీమ్ వెల్లడించింది. తన అనుభవాల వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి అవాస్తవాలను వైరల్ చేయడం బాధాకరమని పేర్కొంది. సదరు పాడ్క్యాస్ట్ సంస్థలు విడుదల చేసిన నోట్ను జాన్వీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. "వాస్తవాలు తెలుసుకోండి.. అవాస్తవాలను ప్రచారం చేయకండి" అంటూ ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం జాన్వీ తెలుగులో 'పెద్ది' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.