ఏపీ ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

  • ఏపీ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా నిలపాలన్న సీఎం చంద్రబాబు
  • పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ తప్పనిసరి
  • రవాణా వ్యయం తగ్గింపు అత్యంత కీలకమని స్పష్టీకరణ
  • పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటకంపై ప్రత్యేక దృష్టి
  • ప్రతి జిల్లాలో మెగా ఇండస్ట్రియల్ పార్క్.. యువతకు ఉపాధి కల్పన
ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయి బ్రాండ్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్పత్తుల నాణ్యతను పెంచడంతో పాటు, వాటికి ప్రపంచ మార్కెట్ కల్పించేందుకు అవసరమైన పటిష్ఠమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో 'ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్ల' ఏర్పాటుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఈ క్లస్టర్లు చోదకశక్తులుగా మారాలని ఆకాంక్షించారు.

పారిశ్రామిక క్లస్టర్లకు సమగ్రమైన లాజిస్టిక్స్ కనెక్టివిటీని అందించడం అత్యంత కీలకమని సీఎం నొక్కిచెప్పారు. ఉత్పత్తుల తయారీ కేంద్రాలకు రోడ్డు, రైలు, పోర్టు మార్గాలను అనుసంధానం చేయడం ద్వారా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. రవాణా వ్యయం తగ్గితేనే ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్‌లో పోటీతత్వం పెరుగుతుందని, అంతిమంగా పరిశ్రమలకు, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. ఈ క్లస్టర్లకు నీరు, విద్యుత్, కోల్డ్ చైన్, వేర్ హౌసింగ్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ జరగాలని సూచించారు.

సమీక్షలో భాగంగా విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ 'భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన' (భవ్య) పథకం కింద చేపట్టనున్న పారిశ్రామిక, కెమికల్ పార్కుల అభివృద్ధిపై సీఎం అధికారులతో చర్చించారు. 2026-27 నాటికి ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్క్, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, కంటైనర్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌తో పాటు 175 ఎంఎస్ఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసే అంశంపై ప్రణాళికలను పరిశీలించారు.

పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు, రైతులకు కూడా అందాలని సీఎం ఆకాంక్షించారు. పారిశ్రామిక క్లస్టర్లలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను భాగస్వామ్యం చేయడం ద్వారా రైతులు పండించిన పంటలకు మంచి ధర లభించేలా చూడాలన్నారు. 'పరిశ్రమలు-మౌలిక సదుపాయాలు-పర్యాటకం' అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాలని నిర్దేశించారు. ప్రతి జిల్లాలో ఒక మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

పరిశ్రమల ఏర్పాటుతో పాటు వాటికి అనుబంధంగా ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు. 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్' కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించి, ఏపీని అగ్రస్థానంలో నిలపాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యాభివృద్ధి జరగాలని, ఇందుకోసం యూనివర్సిటీల్లో హైబ్రీడ్ విధానంలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేయాలని అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, అటవీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
Andhra Pradesh
AP Products
Global Branding
Industrial Clusters
MSME Parks
Product Perfection
Economic Development
AP Industries
Rare Earth Mineral Park

More Telugu News