ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కిడ్నాప్.. గన్‌తో బెదిరించి రూ. 1.8 కోట్లు బదిలీ!

Shubhra Ranjan Kidnapped 18 Crore Rupees Transferred
  • ఢిల్లీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ను కిడ్నాప్ చేసిన ఫ్రాంచైజీ భాగస్వామి
  • అరుపులు బయటకు వినిపించకుండా ఫ్లాట్‌లో సుందరకాండ పారాయణం 
  • బాధితురాలికి గంటలపాటు నరకం చూపిన నిందితులు
  • డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు
  • ఆసుపత్రి బెడ్‌పై నిందితుడి అరెస్ట్
వ్యాపార భాగస్వామే కాలయముడయ్యాడు. నమ్మించి పిలిపించి, కిడ్నాప్ చేసి, కణతకు తుపాకీ గురిపెట్టి గంటలపాటు నరకం చూపించాడు. బలవంతంగా రూ.1.89 కోట్లు ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకున్నాడు. భోపాల్‌లో జరిగిన ఈ సంచలన ఘటన, ఏ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌కూ తీసిపోని రీతిలో సాగింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్‌కు ఎదురైన ఈ భయానక అనుభవం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ‘శుభ్రా రంజన్ ఐఏఎస్ అకాడమీ’ డైరెక్టర్ శుభ్రా రంజన్‌ను, అదే అకాడమీకి భోపాల్‌లో ఫ్రాంచైజీ నడుపుతున్న ప్రియాంక్ శర్మ మోసపూరితంగా భోపాల్‌కు ఆహ్వానించాడు. నగరంలో మరో సెంటర్ ప్రారంభించాలని, సెమినార్ నిర్వహించాలని నమ్మబలికాడు. ఇది నిజమేనని నమ్మి ఆమె భోపాల్ వచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో, ఆమె బస చేస్తున్న 5-స్టార్ హోటల్ నుంచి ప్రియాంక్ ఆమెను తన కారులో ఎక్కించుకుని బాగ్‌సేవానియా ప్రాంతంలోని ఓ అద్దె ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు.

అప్పటికే అక్కడ ప్రియాంక్ ఏర్పాటు చేసిన సాయుధులైన వ్యక్తులు కాపు కాశారు. ఫ్లాట్‌లోకి వెళ్లగానే శుభ్రా రంజన్, ఆమె సహాయకులను బంధించారు. దాదాపు నాలుగు గంటల పాటు తుపాకీతో బెదిరిస్తూ, ‘జనక్షిలా సొసైటీ’, ‘ఆర్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్’ పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలకు రూ.1.89 కోట్లు ఆన్‌లైన్‌లో బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. వారి అరుపులు, కేకలు బయటకు వినిపించకుండా ఉండేందుకు నిందితులు అదే ఫ్లాట్‌లో సుందరకాండ పారాయణం ఏర్పాటు చేయడం గమనార్హం. ఇది భక్తితో చేసింది కాదని, బాధితురాలి గొంతును అణచివేసేందుకే ఈ నాటకం ఆడారని పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా భయపెట్టేందుకు ఓ నకిలీ వీడియోను కూడా రికార్డ్ చేశారు. అందులో ఓ వ్యక్తిని తాళ్లతో కట్టి బాక్సులో బంధించినట్లు చూపించి, ఫిర్యాదు చేస్తే తమ సహచరులకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

రంగంలోకి క్రైమ్ బ్రాంచ్.. ఖాతాల స్తంభన
డబ్బు బదిలీ పూర్తయ్యాక బుధవారం రాత్రి బాధితులను విడిచిపెట్టారు. వెంటనే బాధితుల తరఫున సంతోష్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భోపాల్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ సింగ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గంటల వ్యవధిలోనే స్పందించిన పోలీసులు, నిందితులు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. దీంతో రూ.1.89 కోట్ల మొత్తం భద్రంగా ఉంది.

మరోవైపు, అరెస్ట్ తప్పదని భావించిన ప్రధాన నిందితుడు ప్రియాంక్ శర్మ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అది విఫలమవడంతో, తీవ్ర అనారోగ్యం నటిస్తూ భోపాల్ ఎయిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చేరాడు. అయితే, పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, వైద్యులను సంప్రదించి అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్ధారించుకుని, ఆస్పత్రి బెడ్‌పైనే అతడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో ప్రియాంక్ తల్లి, భార్య పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

ప్రియాంక్ విచారణ అనంతరం మరో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిని కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ నేరంలో ఉపయోగించిన కారు, మొబైల్ ఫోన్, తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రియాంక్ భార్య పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. దోపిడీకి గురైన డబ్బును తిరిగి బాధితురాలికి అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు.
Go Back to Shorts
Shubhra Ranjan
IAS academy
kidnap
Bhopal
Priyank Sharma
crime branch
extortion
online transfer
gun threat
ransom

More Telugu News