మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ ఆపాల్సింది వారే: భారత్‌లో ఇరాన్ రాయబారి

  • యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తేవాలన్న ఇరాన్
  • యుద్ధం ప్రారంభించిన వారి చేతిలోనే పరిష్కార మార్గం ఉందని వ్యాఖ్య
  • అమెరికా, ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేయడంతో ప్రతిస్పందించటామని వెల్లడి
అమెరికాతో యుద్ధాన్ని ఇరాన్ కోరుకోవడం లేదని, ఈ ఘర్షణను నివారించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని, వారు నిరంతరం దాడులు చేయడంతో తాము ప్రతిస్పందించాల్సి వచ్చిందని భారత్‌లో ఇరాన్ రాయబారి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం లేని, శాంతి లేని పరిస్థితి నెలకొందని అన్నారు.

సాధారణ పరిస్థితి నెలకొనాలా, వద్దా అనే విషయం ఈ యుద్ధం ప్రారంభించిన వారి చేతిలోనే ఉందని స్పష్టం చేశారు. ఇరాన్ మాత్రం యుద్ధాన్ని కోరుకోవడం లేదని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేయడంతో తాము ప్రతిస్పందించాల్సి వచ్చిందని అన్నారు. దాడులు చేసే అధికారం వాళ్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. చర్చల సమయంలోనే సుప్రీం లీడర్ సహా అనేకమంది మరణానికి వారు కారణమయ్యారని మండిపడ్డారు.

చిన్నారులు, సామాన్యులను ఎంతో మందిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం వల్ల నాలుగు వేలమంది చనిపోగా, 40 వేల ఇరాన్ పౌరులు గాయపడినట్లు చెప్పారు. తమ దేశంలో ఎన్నో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అన్నారు. తాము బేషరతుగా లొంగిపోవాలని వారు చెబుతున్నారని, దానిని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచదేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే వారి లక్ష్యం నెరవేరదని వ్యాఖ్యానించారు.

Abdul Majid Hakim Elahi
Iran
India
Israel
America
War
Middle East conflict
Iran supreme leader
Ceasefire
Peace

More Telugu News