తండ్రిని గౌరవించలేని వారు రాజకీయాలు చేస్తారా?: కవితపై దానం నాగేందర్ ఫైర్
- పెద్దాయనను కవిత ఇబ్బంది పెట్టడం తగదన్న దానం
- కవిత కబుర్లు చెప్పడం మానుకోవాలని హితవు
- రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం హామీలను నెరవేరుస్తోందని వెల్లడి
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితపై ధ్వజమెత్తారు. ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, కవిత తన తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కవిత తన ఇంటి సమస్యలను రోడ్డు మీదకు తీసుకువస్తూ, తండ్రిని చులకన చేయడం సరికాదని హితవు పలికారు.
"సొంత తల్లిదండ్రులను గౌరవించలేని వారు అసలు మనుషులేనా?" అని ప్రశ్నిస్తూ, కవిత కబుర్లు చెప్పడం మానుకొని రాజకీయంగా మాట్లాడాలని సూచించారు. పెద్దాయన కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడం కవితకు తగదని అన్నారు. అనవసరమైన విషయాలతో ఆయనను ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇక ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని దానం నాగేందర్ స్పష్టం చేశారు. రైతు భరోసా పంపిణీలో కొంత ఆలస్యం జరిగి ఉండవచ్చు కానీ, గతంలో అస్సలు ఇవ్వకపోవడం కంటే ఇప్పుడు ఆలస్యంగానైనా రైతులకు మేలు జరగడం మంచిదే కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం ఎవరినీ వ్యక్తిగతంగా వేధించాలనే ఉద్దేశంతో లేదని, కేవలం ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు.