అమరావతిలో బసవతారకం ఆసుపత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
- తుళ్లూరు వద్ద బసవతారం ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన బాలకృష్ణ
- అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్న బాలయ్య
- అమరావతికి భూములిచ్చిన రైతులు, మహిళలకు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ
దశాబ్దాలుగా క్యాన్సర్ బాధితులకు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అసమాన సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచే సేవలను అందించిన బసవతారకం ఆసుపత్రి... ఇప్పుడు ఏపీకి విస్తరిస్తోంది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తుళ్లూరు వద్ద బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. బసవతారకం ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... అమరావతి నిర్మాణం కోసం వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులకు, మహిళలకు పాదాభివందనం చేస్తున్నానని బాలయ్య అన్నారు. వారి సహకారం వల్లే ఇలాంటి భారీ ప్రాజెక్టులు సాధ్యమవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ రోజు స్వాతి నక్షత్రం అని, అది తన తండ్రి ఎన్టీఆర్, తన ఇష్టదైవం నరసింహ స్వామి పుట్టిన నక్షత్రమని... ఈ రోజే పనులు ప్రారంభించడం విశేషమని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో అమరావతిలో ఆసుపత్రిని నిర్మిస్తున్నామని బాలయ్య తెలిపారు. హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జూన్ 22న భారీ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను ఆహ్వానించబోతున్నామని తెలిపారు.
అమరావతి నిర్మాణం అనేది హడావుడిగా చేసేది కాదని, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రణాళికాబద్ధంగా చేస్తున్నామని స్పష్టం చేశారు.
మరోవైపు తొలి దశలో... 7 అంతస్తులతో, 500 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. దాదాపు రూ. 650 కోట్ల భారీ వ్యయంతో ఈ దశను పూర్తి చేయబోతున్నారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.