ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచ‌ల‌నం.. స్టేట్ టాప‌ర్‌కు 600 మార్కులకు 599 వచ్చాయి!

Visakhapatnam Student Gnaneshwari Get 599 Marks Out Of 600 In AP SSC Results 2026
  • 599 మార్కులతో విశాఖ విద్యార్థిని జ్ఞానేశ్వరి స్టేట్ టాపర్
  • ఒక్క ఆంగ్లంలో ఒక్క మార్కు తగ్గిన వైనం
  • పరీక్షలకు ముందు టైఫాయిడ్ వచ్చినా సత్తా చాటిన టాపర్
  • రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది సాధించిన 81.14 శాతంతో పోలిస్తే ఈసారి ఫలితాలు 4.15 శాతం మెరుగుపడటం గమనార్హం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.90 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, 82.68 శాతం మంది బాలురు పాసయ్యారు. అంటే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు 5.22 శాతం అధిక ఉత్తీర్ణతను సాధించారు. అంతేగాక‌ పాసైన వారిలో 83.69శాతం మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులవడం విశేషం.

 రాష్ట్ర టాపర్‌గా విశాఖకు చెందిన కె. జ్ఞానేశ్వరి
ఈ ఫలితాల్లో విశాఖపట్నానికి చెందిన కె. జ్ఞానేశ్వరి రాష్ట్ర టాపర్‌గా నిలిచి ప్రభంజనం సృష్టించారు. ఆమె మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విశాఖ ఎన్ఏడీలోని శ్రీచైతన్య స్కూల్‌లో చదివిన జ్ఞానేశ్వరి, కేవలం ఒక్క మార్కుతో 600 మార్కుల లక్ష్యాన్ని చేజార్చుకున్నారు. ఆంగ్లంలో ఆమెకు ఒక్క మార్కు తగ్గింది.

జ్ఞానేశ్వరి తండ్రి కె. శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి భారతి విశాఖ నేవల్ డాక్‌యార్డులో ఉద్యోగినిగా ఉన్నారు. అయితే, ఇంతటి ఘన విజయం సాధించడానికి ముందు జ్ఞానేశ్వరి ఒక పెద్ద సవాలును ఎదుర్కొన్నారు. పరీక్షలకు ముందు టైఫాయిడ్ బారిన పడటంతో ఆందోళన చెందినా, ధైర్యంగా కోలుకుని పరీక్షలకు హాజరయ్యారు. పట్టుదలతో చదివి అద్భుతమైన మార్కులు సాధించారు. భవిష్యత్తులో ఇంటర్‌లో బైపీసీ గ్రూప్ తీసుకుని, డాక్టర్‌ కావడమే తన లక్ష్యమని జ్ఞానేశ్వరి తెలిపారు.

కాగా, గతేడాది కాకినాడకు చెందిన విద్యార్థిని నేహాంజని 600కు 600 మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. అయితే, ఈ ఏడాది ఆ రికార్డును ఎవరూ అందుకోలేకపోయారు. అత్యధికంగా 599 మార్కులే వచ్చాయి.
Go Back to Shorts
AP SSC Results 2026
State Topper
Visakhapatnam
Student
Gnaneshwari

More Telugu News