ఏపీ టెన్త్ ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!

  • ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల 
  • ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
  • గతేడాదితో పోలిస్తే ఈసారి 85.25 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత
  • ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు రావడంపై హర్షం
  • విద్యాశాఖ మంత్రి లోకేష్, అధికారులకు సీఎం అభినందనలు
ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన పదో తరగతి ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉత్తీర్ణత శాతం గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాశాఖ పనితీరును, మంత్రి నారా లోకేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ ఏడాది పదో తరగతిలో 85.25 శాతం ఉత్తీర్ణత నమోదవడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది ఇది కేవలం 81.1 శాతంగా మాత్రమే ఉందని గుర్తుచేశారు. బాలురతో పోలిస్తే బాలికలు 5.22 శాతం అధిక ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగుపడటాన్ని ఆయన ప్రస్తావించారు. గతేడాది 72.8 శాతంగా ఉన్న ప్రభుత్వ బడుల ఉత్తీర్ణత, ఈసారి 78.39 శాతానికి పెరగడం స్ఫూర్తిదాయకమని అన్నారు.

విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలను ఇచ్చిందని చంద్రబాబు కొనియాడారు. ఈ విజయం వెనుక ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, శాఖాధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని అభినందిస్తున్నానని తెలిపారు. పిల్లల్లో నైతిక విలువలతో పాటు సమగ్ర విద్యా వికాసానికి విద్యాశాఖ చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.

Chandrababu
10th Class Results
Nara Lokesh
TDP
Andhra Pradesh

More Telugu News