ఉద్యమంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేశాం, కానీ పొత్తు పెట్టుకోలేదు: బీజేపీ ఎంపీ

  • బీఆర్ఎస్ చచ్చిన పాములాంటిదన్న డాక్టర్ కె. లక్ష్మణ్
  • ప్రజలు నమ్మకంతో ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శ
  • బీజేపీ తెలంగాణలో అజేయశక్తిగా ఎదుగుతోందన్న లక్ష్మణ్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమం సమయంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేశామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఒక చచ్చిపోయిన పాములాంటిదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని జోస్యం చెప్పారు.

ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రతిపక్ష హోదా కల్పిస్తే, కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. సభకు రావడం లేదని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని అన్నారు. ప్రభుత్వంతో బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. బీజేపీ తెలంగాణలో అజేయశక్తిగా ఎదుగుతోందని, కానీ ఆ పార్టీలు దొడ్డిదారిన అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయని అన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్‌తో కలిసి ఉద్యమంలో పనిచేశామని అన్నారు. కానీ తాము ఎప్పుడూ ఎవరితో పొత్తు పెట్టుకోలేదని అన్నారు. స్థానిక ఎన్నికలైనా, మరే ఎన్నికైనా ఒంటరిగానే పోటీ చేస్తామని అన్నారు. భవిష్యత్తులోనూ ఒంటరిగా పోటీ చేస్తామని పేర్కొన్నారు. నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తెలంగాణకు మొదటిసారి రాబోతున్నారని తెలిపారు. మే 10న పరేడ్ మైదానంలో జనాగ్రహ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

DR K Laxman on BJP tie up
DR K Laxman on BRS

More Telugu News