ఇరాన్ యుద్ధం వల్ల మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: పాక్ ప్రధాని

Pakistan Facing Major Economic Fallout Due To Iran War says Shehbaz Sharif
  • అమెరికా-ఇరాన్ యుద్ధంతో పాక్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమ‌న్న పాక్ ప్ర‌ధాని
  • 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరిగిన ఆయిల్ బిల్లు
  • ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య 21 గంటల పాటు సాగిన చర్చలు
  • త్వరలో రెండో విడత చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం
  • శాంతి ప్రయత్నాలు కొనసాగిస్తామన్న షెహబాజ్
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గత రెండేళ్లలో తాము సాధించిన ఆర్థిక పురోగతిపై తీవ్ర ప్రభావం చూపిందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా దేశ చమురు దిగుమతి బిల్లు 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరిగిపోయిందని, ఇది ఆర్థిక వ్యవస్థపై పెను భారం మోపుతోందని కేబినెట్ సమావేశంలో తెలిపారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించి, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ప్రాంతీయ స్థిరత్వం కోసం పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను కేబినెట్‌కు వివరిస్తూ.. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఏకంగా 21 గంటల పాటు మారథాన్ చర్చలు జరిగాయని, ఇది దౌత్యపరంగా ఒక ముఖ్యమైన ముందడుగు అని షెహబాజ్ పేర్కొన్నారు. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ఉప ప్రధాని ఇషాక్ దార్ వంటి సీనియర్ అధికారుల సమన్వయంతో ఈ చర్చలు విజయవంతమయ్యాయని, దాని ఫలితంగానే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోందని వివరించారు. 

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ తన బృందంతో పాకిస్థాన్‌లో పర్యటించి, పలు దఫాలు చర్చలు జరిపారని ప్రధాని వెల్లడించారు. తనతో రెండు గంటల పాటు సమావేశమయ్యారని, తమ నాయకత్వంతో సంప్రదించిన తర్వాత సానుకూల నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అరఘ్చీ హామీ ఇచ్చారని చెప్పారు. అరఘ్చీ రష్యా పర్యటనకు ముందు తాను ఫోన్‌లో మాట్లాడానని, ఒమన్‌లో జరిగిన సమావేశాలు కూడా సానుకూల దృక్పథంతో జరిగాయని ఆయన చెప్పినట్లు షెహబాజ్ తెలిపారు. త్వరలోనే ఈ వివాదం ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

త్వరలో రెండో విడత చర్చలకు కూడా పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వడానికి ప్రణాళికలు రచిస్తోంది. శాంతి పరిష్కారం కోసం ఇరాన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల పునరుద్ఘాటించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, పలువురు ఉన్నత కమాండర్లు మరణించడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఇరాన్ ప్రతీకార చర్యలతో ఈ ఘర్షణ గల్ఫ్ ప్రాంతమంతటా విస్తరించిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Shehbaz Sharif
Pakistan
Economic Fallout
Iran War
Iran-US War

More Telugu News