ధురంధర్‌-2 క్లైమాక్స్‌ గ్రాఫిక్స్‌ కాదు.. 500 లీటర్ల పెట్రోల్‌తో భారీ పేలుళ్లు!

  • 500 లీటర్ల పెట్రోల్‌తో షూటింగ్
  • సీజీఐ వాడకుండా రియల్ పేలుళ్లు
  • ప్రాణాలకు తెగించి రణ్‌వీర్ స్టంట్స్‌
  • అందుకే అత్యంత సహజంగా క్లైమాక్స్ సీన్‌
వెండితెరపై గ్రాఫిక్స్ హడావుడి లేకుండా రియల్ స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించడం ఇప్పట్లో చాలా అరుదు. కానీ రణ్‌వీర్‌ సింగ్, ఆదిత్య ధర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ధురంధర్ 2' (ధురంధర్: ది రివెంజ్) క్లైమాక్స్ సీన్ కోసం చిత్ర బృందం ప్రాణాలకు తెగించి పనిచేసింది. ఈ సినిమా క్లైమాక్స్‌లోని భారీ పేలుడు వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఎస్‌ఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్ విశాల్ త్యాగి మాటల్లో..

అంతా ఒరిజినల్
ప్రస్తుత సినిమాల్లో చిన్నపాటి మంటలు కావాలన్నా సీజీఐ వాడుతున్నారు. కానీ దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం క్లైమాక్స్ పేలుడు సీన్ సహజంగా ఉండాలని పట్టుబట్టారు. ఈ సీన్ కోసం ఏకంగా 500 లీటర్ల పెట్రోల్‌ను వాడారు. ఆఖరి ట్యాంకర్ పేలుడు సమయంలో రణ్‌వీర్ సింగ్ చాలా దగ్గరగా నడుస్తూ రావాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మంటలు ఆయన్ను చుట్టుముట్టే ప్రమాదం ఉంది. కానీ చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ఆ రిస్క్ తీసుకుంది.

అర్జున్ రాంపాల్‌ని పక్కన పెట్టి..
భద్రతా కారణాల దృష్ట్యా ఈ సీన్ షూట్ చేసేటప్పుడు చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది. మొదట నటుడు అర్జున్ రాంపాల్ కూడా ఈ షాట్‌లో ఉండాలని భావించినా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన్ను పేలుడు జరిగే ప్రదేశానికి దూరంగా ఉండమని కోరారు. అయితే రణ్‌వీర్ సింగ్ మాత్రం టీమ్ మీద ఉన్న నమ్మకంతో ఏమాత్రం భయం లేకుండా ఆ రిస్కీ స్టంట్ పూర్తి చేశారు. 500 లీటర్ల ఇంధనంతో పాటు 25 కిలోల పేలుడు పదార్థాలను కూడా వాడి ఈ సీన్‌ను అత్యంత సహజంగా చిత్రీకరించారు.

250 లీటర్లు వాడమని చెప్పినా..!
‘ప్రొడక్షన్ టీమ్ కేవలం 250 లీటర్ల పెట్రోల్ వాడమని చెప్పినా సీన్ పవర్‌ఫుల్‌గా రావాలంటే 500 లీటర్లు ఉండాల్సిందేనని పట్టుబట్టాను. రణ్‌వీర్ కూడా షూట్ పూర్తయ్యాక మా కష్టాన్ని అభినందించారు’ అని విశాల్ త్యాగి తెలిపారు. నిజమైన రైలు బోగీలు, కంటైనర్లు వాడి తీసిన ఈ క్లైమాక్స్ సీన్ చూస్తే.. గ్రాఫిక్స్ కంటే రియాలిటీ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అర్థమవుతుంది.

Dhurandhar 2
Blasts
Petrol
CGI
Ranveer Singh
Adithya Dhar
Bollywood

More Telugu News