పాత రైళ్లు ఏమైపోతాయి?.. రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏం చేస్తారో తెలుసా?

  • రైళ్లకు నిర్ణీత జీవితకాలం.. ఆ తర్వాత వాటికి రిటైర్మెంట్
  • పాత ప్యాసింజర్ కోచ్‌లు గూడ్స్ బోగీలుగా మార్పు
  • కార్లు, ట్రాక్టర్ల రవాణాకు ఎన్ఎంజీ కోచ్‌ల వినియోగం
  • మిషన్ జీరో స్క్రాప్‌లో వేల సంఖ్యలో కోచ్‌లు, ఇంజిన్ల తొలగింపు
  • పనిచేయని రైళ్లను తుక్కుగా మార్చి విడిభాగాల అమ్మకం
వేగంగా దూసుకెళ్తున్న రైలును చూసినప్పుడు, దాని జీవితకాలం ముగిశాక ఏమవుతుందనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వేలో, కాలం చెల్లిన రైళ్ల కథ మనం ఊహించిన దానికంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవి కేవలం మాయం కావు. రిటైర్మెంట్ తర్వాత రూపు మార్చుకుంటాయి, కొన్నిసార్లు తుక్కుగా మారిన తర్వాత కూడా రైల్వేకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి.

రైళ్లకు రిటైర్మెంట్.. కొత్త జీవితం
మనుషుల్లాగే రైళ్లకు కూడా నిర్దిష్ఠ‌ జీవితకాలం ఉంటుంది. ఉదాహరణకు పాత తరం ఐసీఎఫ్‌ ప్యాసింజర్ కోచ్‌లు 25-30 ఏళ్లు, ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు 35 ఏళ్ల వరకు సేవలందిస్తాయి. కేవలం వయసు పైబడటమే కాదు, భద్రతా ప్రమాణాలు తగ్గినా, మరమ్మతుల ఖర్చు పెరిగినా, లేదా సాంకేతికంగా వెనుకబడినా రైళ్లను సేవ‌ల నుంచి తొలగిస్తారు. అయితే, రిటైర్మెంట్ అంటే వెంటనే తుక్కుగా మార్చడం కాదు. చాలా రైళ్లకు రెండో జీవితం లభిస్తుంది. పాత ప్యాసింజర్ కోచ్‌లను 'న్యూ మోడిఫైడ్ గూడ్స్స (ఎన్ఎంజీ) కోచ్‌లుగా మారుస్తారు. ఈ ప్రక్రియలో కోచ్‌లోని సీట్లు, ఫ్యాన్లు, లైట్లు వంటివి తొలగించి, కిటికీలను పూర్తిగా మూసివేస్తారు. కోచ్ బాడీని లోహంతో బలోపేతం చేసి, సరకు రవాణాకు అనువుగా తయారుచేస్తారు. వీటిని కార్లు, ట్రాక్టర్లు, మినీ ట్రక్కుల రవాణాకు వాడతారు. ఈ కొత్త రూపంలో అవి మరో 5 నుంచి 10 ఏళ్ల వరకు పనిచేస్తాయి.

తుది దశ.. తుక్కుగా మార్చడం
'మిషన్ జీరో స్క్రాప్', విద్యుదీకరణ ప్రణాళికల్లో భాగంగా భారతీయ రైల్వే ఇటీవల భారీగా మార్పులు చేపట్టింది. పాత డీజిల్ ఇంజిన్ల స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్లు, పాత కోచ్‌ల స్థానంలో ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో కేవలం 2020 నుంచి 2024 మధ్య కాలంలోనే 1,000కి పైగా ఇంజిన్లు, 37,000కు పైగా కోచ్‌లు, వ్యాగన్లను సేవ‌ల నుంచి తొలగించారు.

ఇలా పూర్తిగా పనిచేయదని నిర్ధారించిన రైలును తుక్కుగా మార్చే ప్రక్రియ మొదలవుతుంది. రైలును విడిభాగాలుగా విడదీసి, ఇనుము, ఉక్కు వంటి ఫెర్రస్ లోహాలు, రాగి, అల్యూమినియం, ఇత్తడి వంటి నాన్-ఫెర్రస్ లోహాలను వేరు చేస్తారు. వీటితో పాటు సీట్లు, ఏసీలు, లైట్లు, బ్యాటరీల వంటి చిన్న భాగాలను కూడా వేరు చేసి, పునర్వినియోగానికి లేదా రీసైక్లింగ్‌కు పంపుతారు. ఈ స్క్రాప్‌ను అమ్మడం ద్వారా రైల్వే శాఖకు భారీ ఆదాయం సమకూరుతుంది. ఈ విధంగా ఒక రైలు జీవితం మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ కాలం ఉంటుంది. ప్రయాణికులకు సేవ చేయడంతో మొదలై, చివరికి సరకు రవాణా, తుక్కు రూపంలోనూ తన సేవలను కొనసాగిస్తూనే ఉంటుంది.

Indian Railway
Retire Trains
goods carriers

More Telugu News