రేపు తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి... రిసెప్షన్ ఎప్పుడంటే!

  • ఒకటికాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య
  • వేద సంప్రదాయాల ప్రకారం జరగనున్న పెళ్లి వేడుక
  • మే 1న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్
  • ఏప్రిల్ 5న శ్రీనివాస్, కావ్యల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. ఏప్రిల్ 29న తిరుమల పుణ్యక్షేత్రంలో వీరి వివాహం జరగనుంది. రాత్రి 11:13 గంటలకు పండితులు శుభ ముహూర్తాన్ని నిశ్చయించారు. 

సనాతన ధర్మ, వేద సంప్రదాయాల ప్రకారం అత్యంత భక్తిశ్రద్ధలతో, నిరాడంబరంగా ఈ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమం కోసం ప్రముఖ డిజైనర్ శ్రవణ్ కుమార్ వధూవరులకు ప్రత్యేకంగా సంప్రదాయబద్ధమైన దుస్తులను రూపొందించారు. పెళ్లి అనంతరం మే 1న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రుల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడైన శ్రీనివాస్, కొంతకాలంగా కావ్య రెడ్డితో ప్రేమలో ఉన్నారు. కావ్య సినీ రంగానికి చెందిన వారు కాదు, ఆమె తండ్రి ఒక ప్రముఖ న్యాయవాది అని సమాచారం. మార్చిలో రోకా వేడుక జరుపుకున్న ఈ జంటకు, ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలవ్వగా, ఏప్రిల్ 27న శ్రీనివాస్‌కు పెళ్లికొడుకు ఫంక్షన్‌ను నిర్వహించారు.

గత మార్చిలో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తూ శ్రీనివాస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. "నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నా రోజులను ఆనందంతో, చిరునవ్వులతో నింపేశావు. నీ ముఖంపై ఆ చిరునవ్వు ఎప్పటికీ చెరిగిపోకుండా చూసుకుంటా" అని కావ్య గురించి రాసుకొచ్చారు.

Bellamkonda Srinivas
Kavya Reddy
Wedding
Tirumala
Reception
Hyderabad
Tollywood

More Telugu News