పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ

  • రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు చేపట్టిన వైసీపీ
  • పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారన్న జగన్
  • ఏ సమస్య వచ్చినా దాన్ని క్యాష్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటని విమర్శ

రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్టు పార్టీ నాయకత్వం తెలిపింది. ఈ క్రమంలో, పలుచోట్ల వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మరోవైపు, ‘ఎక్స్’ వేదికగా స్పందించిన వైసీపీ అధినేత జగన్... ఇంధన సంక్షోభాన్ని ‘ప్రభుత్వ ప్రేరేపిత కృత్రిమ కొరత’గా అభివర్ణించారు.


పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో లేని కొరత ఏపీలోనే ఎందుకుందని జగన్ ప్రశ్నించారు. డీలర్లు, కూటమి నేతలు కుమ్మక్కై నిల్వలు దాచిపెట్టి ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా దానిని క్యాష్ చేసుకోవడం అలవాటని, గతంలో ఎరువులు, విత్తనాల విషయంలో జరిగినట్లే ఇప్పుడు ఇంధనం విషయంలోనూ జరుగుతోందని మండిపడ్డారు.


రబీ కోతల సమయంలో యంత్రాలకు డీజిల్ అందక రైతులు, ఏరియేటర్లు నడవక ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే సాకుతో డీలర్లు స్టాక్ దాచిపెడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

YSRCP
Jagan
Petrol
Diesel

More Telugu News