శంకరపల్లిలో ఘోర విషాదం: క్రేన్లు కూలి ఐదుగురు కార్మికుల మృతి

  • శంకరపల్లి ఎన్సీసీ వర్క్‌షాప్‌లో ఘటన 
  • ఘటనలో ఐదుగురు వలస కార్మికుల మృతి, 12 మందికిపైగా గాయాలు
  • భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఘటన
  • క్రేన్ల సేఫ్టీ లాక్‌లు వేయకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా
  • యూనిట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి రెండు భారీ క్రేన్లు కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో 12 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శంకరపల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో ఉన్న ఎన్సీసీ (నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ) సెంట్రల్ వర్క్‌షాప్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే, నిన్న సాయంత్రం సమయంలో భారీ వర్షం మొదలవడంతో, సుమారు 17 మంది కార్మికులు అక్కడే ఉన్న ఓ తాత్కాలిక షెడ్డు కిందకు వెళ్లి తలదాచుకున్నారు. అదే సమయంలో, బలమైన గాలుల ధాటికి కదిలే క్రేన్లలో ఒకటి పక్కకు జరిగి మరో క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రభావంతో రెండు క్రేన్లు అదుపుతప్పి కార్మికులు ఉన్న షెడ్డుపై కూలిపోయాయి. దీంతో నలుగురు బిహార్, ఒకరు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న శంకరపల్లి పోలీసులు, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో భద్రతా వైఫల్యాలు ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. క్రేన్ల సేఫ్టీ లాక్‌లు సరిగ్గా బిగించకపోవడం వల్లే అవి గాలులకు కదిలి కూలిపోయాయని అధికారులు అనుమానిస్తున్నారు.

యూనిట్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.
 

Accident
hyderabad
Sankarapalli
gantry cranes

More Telugu News