ఆంధ్రా యూనివర్సిటీకి చంద్రబాబు బొనాంజా... వర్సిటీ వందేళ్ల వేడుకలో సీఎం ప్రసంగం

Chandrababu Naidu Announces Bonanza for Andhra University at Centenary Celebrations
  • ఆంధ్రా యూనివర్సిటీకి రూ.500 కోట్ల నిధులను ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • ప్రపంచ టాప్ 100, దేశంలో టాప్ 5 యూనివర్సిటీలలో ఏయూ ఒకటిగా నిలవాలని ఆకాంక్ష
  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు రేపు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడి
  • పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సహకారంతో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నిర్మిస్తామని ప్రకటన
  • విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపు
ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచంలోని టాప్ 100, దేశంలోని టాప్ 5 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలపాలన్నదే తన లక్ష్యమని, ఇందుకు తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.500 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 100 సంవత్సరాల ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అభివృద్ధికి తన దార్శనికతను, ప్రభుత్వ ప్రణాళికలను ఆవిష్కరించారు.

విశాఖ అభివృద్ధి అన్‌స్టాపబుల్
విశాఖ నగరం రేపటి నుంచి గ్లోబల్ సిటీగా మారబోతోందని, దీని అభివృద్ధి ఇక అన్‌స్టాపబుల్ అని చంద్రబాబు అన్నారు. నగరానికి రానున్న అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్‌కు మంగళవారం శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. యూనివర్సిటీలో ఇప్పటికే రూ.64 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించినట్టు తెలిపారు. విద్యాలయాలు కేవలం డిగ్రీలు, పట్టాలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా, నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. సచిన్ టెండూల్కర్ చెప్పినట్టుగా, విశాఖ సముద్ర తీరంలోని ప్రశాంత వాతావరణం ఎంతో శక్తిని ఇస్తుందని అన్నారు.

యువతకు స్ఫూర్తిదాయక సందేశం
"చాలామంది నా వయసు 76 అంటారు, కానీ నేనెప్పుడూ అలా అనుకోను. నా ఆలోచనలు 26 ఏళ్ల వ్యక్తిలా ఉంటాయి" అంటూ యువతను ఉత్తేజపరిచారు. గతంలో తాను ఐటీని తీసుకొస్తే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీల గురించి మాట్లాడుతున్నామని, భవిష్యత్ సాంకేతికతపై దృష్టి సారించాలని సూచించారు. "నాలెడ్జ్, ఇన్నోవేషన్, టెక్నాలజీపై దృష్టి పెడితే సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ విజయాలు సాధించవచ్చు. మీరు ఉద్యోగాలు చేయడం కాదు, వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది," అని భరోసా ఇచ్చారు.

ఏయూ ఘన చరిత్ర.. పూర్వ విద్యార్థులకు పిలుపు
ఆంధ్రా యూనివర్సిటీకి వందేళ్ల ఘన చరిత్ర ఉందని, దీనికి తొలి వీసీ కట్టమంచి రామలింగారెడ్డి బలమైన పునాదులు వేయగా, రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఎదిగారని గుర్తుచేశారు. ఈ వర్సిటీ రచయితలకు, కళాకారులకు 'కళాప్రపూర్ణ' బిరుదులిచ్చి గౌరవించిందని, ప్రస్తుతం 58 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం గర్వకారణమని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 కోట్లకు అదనంగా, పూర్వ విద్యార్థులు, దాతలు మరో రూ.500 కోట్లు సమీకరించాలని పిలుపునిచ్చారు. ఇక్కడే చదివిన జీఎంఆర్, మోహన్ రెడ్డి, లారస్‌ సత్యానారాయణతో పాటు మరికొందరు వ్యాపారులు ఉన్నారు. వారి సాయంతో పాటు, ఒక్కో విద్యార్థి ఒక్కో రూపాయి సాయం అందించినా రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ వస్తుంది. 

స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నిర్మాణమే లక్ష్యం
తాను, తన మిత్రుడు పవన్ కల్యాణ్ కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి సహకారంతో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని సంకల్పం 'వికసిత భారత్ 2047' అయితే, తమ సంకల్పం 'స్వర్ణాంధ్రప్రదేశ్ 2047' అని పునరుద్ఘాటించారు. ఆ సంకల్ప సాధన కోసం జైత్రయాత్రను ఈ ఆంధ్రా యూనివర్సిటీ నుంచే ప్రారంభిస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు. పిల్లలకు ఇచ్చే అసలైన ఆస్తి చదువేనని, దానిని అందించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని హామీ ఇచ్చారు.
Advertisement
Chandrababu Naidu
Andhra University
Visakhapatnam
AU Centenary Celebrations
Google Data Center
Artificial Intelligence
AI
Quantum Technology
Kattamanchi Ramalinga Reddy
Sarvepalli Radhakrishnan

More Telugu News