గద్వాల మార్కెట్ యార్డ్లో ఎంపీ డీకే అరుణ ఆగ్రహం
- ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించిందన్న డీకే అరుణ
- రైతులు క్వింటాల్కు రూ. 700 నుంచి రూ. 800 వరకు నష్టపోతున్నారని ఆవేదన
- రైతులు 15 రోజులుగా మార్కెట్ యార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నారని వ్యాఖ్య
మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులపై బీజేపీ ఎంపీ డీకే అరుణ గద్వాల మార్కెట్ యార్డ్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లే రైతులు క్వింటాల్కు రూ. 700 నుంచి రూ. 800 వరకు నష్టపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు ఎంఎస్పీ (MSP) ధర రూ. 2,400 ఉన్నప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో సుమారు 2.70 లక్షల క్వింటాళ్ల పంట పండినా, మార్కెట్ యార్డుల్లో సంచులు, హమాలీలు, లారీల కొరత వల్ల కొనుగోలు ప్రక్రియ స్తంభించిందని విమర్శించారు. రైతులు 15 రోజులుగా మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. మల్దకల్, గట్టు మండలాల్లో తక్షణమే అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్ఫెడ్ అధికారులను ఫోన్ ద్వారా కోరారు.