ఆపరేషన్ లోటస్... రాఘవ్ చద్ధా సంచలన ప్రకటనపై ఘాటుగా స్పందించిన ఆప్

  • రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు ఎంపీలు ఆప్‌ను వీడటంపై తీవ్ర దుమారం
  • ఇది బీజేపీ కుట్రేనని, పంజాబ్‌లో ‘ఆపరేషన్ లోటస్’ అమలు చేశారని ఆప్ ఆరోపణ
  • పార్టీ వీడిన వారిని ద్రోహులుగా అభివర్ణించిన ఆప్ నాయకత్వం
  • పంజాబీలకి బీజేపీ మరోసారి వెన్నుపోటు పొడిచిందన్న అరవింద్ కేజ్రీవాల్
  • ఈ కుట్రను అమలు చేయడానికి రాఘవ్ చద్దాను అమిత్ షా వాడుకున్నారని ఆరోపణ
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు పార్లమెంట్ సభ్యులు పార్టీని వీడటం ఆమ్ ఆద్మీ పార్టీలో (ఆప్) పెను దుమారం రేపింది. పార్టీ మారుతున్న వారిపై ఆప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వారిని 'ద్రోహులు'గా అభివర్ణిస్తూ, పంజాబ్ ప్రజలు ఈ వెన్నుపోటును ఎప్పటికీ మర్చిపోరని, క్షమించరని స్పష్టం చేసింది.

ఈ మొత్తం వ్యవహారం వెనుక బీజేపీ హస్తం ఉందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నుంచి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వరకు అందరూ ఆరోపించారు. "పంజాబీలకి బీజేపీ మరోసారి వెన్నుపోటు పొడిచింది" అని కేజ్రీవాల్ ఒకే వాక్యంలో తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ను అమలు చేసిందని సంచలన ఆరోపణలు చేశారు.

పార్టీ మారిన ఎంపీలను ‘ద్రోహులు’గా పేర్కొంటూ, "ఆమ్ ఆద్మీ పార్టీకి, పంజాబ్ ప్రజలకు ఎప్పుడు ద్రోహం జరిగినా, ప్రజలు దానికి తగిన బుద్ధి చెప్పారు. ఈ ద్రోహానికి, మోసానికి కూడా పంజాబ్ ప్రజలు సరైన సమాధానం ఇస్తారు" అని సంజయ్ సింగ్ అన్నారు. "పంజాబ్ రైతులకు వ్యతిరేకంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు చేసిన పార్టీలో చేరి నిజాయతీ కోసం పోరాడతారా? రైతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి కొడుకు ఉన్న పార్టీలోకి వెళతారా?" అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

ఇది అత్యంత నీచమైన ద్రోహం, మోసం అని ఆప్ అధికార ప్రతినిధి అనురాగ్ దండా వ్యాఖ్యానించారు. మరోవైపు, ఆప్ పంజాబ్ యూనిట్ ప్రధాన కార్యదర్శి బల్తేజ్ పన్నూ మాట్లాడుతూ... కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి ఆప్‌ను బలహీనపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రణాళికను అమలు చేయడానికి రాఘవ్ చద్దాను అమిత్ షా ఒక 'సాధనంగా' వాడుకున్నారని ఆయన పేర్కొన్నారు.

Raghav Chadha
AAP
Arvind Kejriwal
BJP
Punjab
Delhi

More Telugu News