ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ... లిఖితపూర్వక హామీకి జేఏసీ నేతల డిమాండ్

RTC JAC meeting with ministers
  • సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, లక్ష్మణ్
  • శంకర్ గౌడ్ మృతిపట్ల మంత్రులు, జేఏసీ నేతల సంతాపం
  • 29 అంశాలకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపిన మంత్రులు
  • మూడు అంశాలపై అధ్యయనం చేయాలన్న మంత్రులు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ప్రత్యేక సీఎస్ వికాస్ రాజ్ కూడా హాజరయ్యారు.

వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మంత్రులు, జేఏసీ నేతలు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రులు భరోసా ఇచ్చారు. ఏ కార్మికుడు కూడా ఆవేశంతో అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటిని తక్షణమే అమలు చేయాలని జేఏసీ నేతలు పట్టుబట్టారు.

కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లలో 29 అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రులు తెలిపారు. మిగిలిన మూడు అంశాలపై అధ్యయనం కోసం కొంత సమయం కావాలని అన్నారు. అయితే ఏయే డిమాండ్లు ఎప్పటిలోగా అమలు చేస్తారో లిఖితపూర్వక హామీ ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షలు, ఉద్యోగం

ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్‌ శంకర్‌ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. స్థానిక ఆర్డీవో ఉమారాణి ఆయన మృతదేహానికి ఈరోజు నివాళులర్పించారు. అనంతరం ఈ ప్రకటన చేశారు. పరిహారంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.
Go Back to Shorts
RTC JAC meeting with ministers
Telangana RTC strike

More Telugu News