కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలి ప్రాధాన్యత వారికే!

  • ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు
  • తొలి విడతగా వితంతువులకు జూన్ 12 నుంచి పింఛన్లు
  • రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మందికి కొత్తగా ప్రయోజనం
  • ఆ తర్వాత దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇచ్చే యోచన
  • కొత్త పింఛన్ల కోసం 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా
ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ నుంచి తొలి విడతగా వితంతువులకు నెలకు రూ.4,000 చొప్పున పింఛన్లు అందించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల గుర్తింపు, నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించారు.

అధికారిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1.53 లక్షల మంది వితంతు పింఛన్‌కు అర్హులుగా ఉన్నారు. వీరందరికీ పింఛన్లు మంజూరు చేస్తే, ప్రభుత్వానికి నెలకు రూ.61 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు లెక్కగట్టారు. కాగా, కూటమి ప్రభుత్వం ఇప్పటికే పింఛన్ తీసుకునే భర్త మరణిస్తే, వారి భార్యలకు 'స్పౌజ్' కేటగిరీ కింద వెంటనే పింఛన్ మంజూరు చేస్తోంది. ఈ విధానంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 2.30 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందాయి. అయితే, 60 ఏళ్లలోపు మగవారికి పింఛన్లు అందకపోవడంతో భర్త చనిపోయిన మహిళలకు వితంతు కోటాలో పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వితంతు పింఛన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత, దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దివ్యాంగుల కేటగిరీలో సుమారు లక్ష మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం దివ్యాంగుల కోటాలో 6.50 లక్షల మంది పింఛన్ తీసుకుంటుండగా, వారిలో దాదాపు లక్ష మంది అనర్హులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. సదరం సర్టిఫికెట్లలోని లోపాలను సరిదిద్ది, అనర్హులను ఏరివేసే ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, అర్హులైన దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వృద్ధులు, ఒంటరి మహిళలు, ఆరోగ్య పింఛన్లతో కలిపి మొత్తం 28 కేటగిరీలలో లబ్ధిదారులకు ప్రతినెలా పింఛన్లు పంపిణీ చేస్తోంది. కొత్త పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేటగిరీలలో కలిపి దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ పింఛన్లు మంజూరు చేస్తే, నెలకు రూ.400 కోట్లు, ఏడాదికి రూ.4,800 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దశలవారీగా అర్హులకు పింఛన్లు అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి స్పష్టత రానుంది.

AP Government
Andhra Pradesh
Pension Scheme
Widow Pension
Disability Pension
AP New Pensions
Chandrababu Naidu
Pension Eligibility
YSR Pension Kanuka
AP Government Schemes

More Telugu News