పాక్‌లో ప్రజారోగ్యం దయనీయం.. నకిలీ వైద్యుల‌తో తంటా.. హెపటైటిస్‌తో కొట్టుమిట్టాడుతున్న దేశం

Pakistan Health Crisis Millions Suffer From Hepatitis C Due to Fake Doctors
  • ప్రపంచంలోనే అత్యధిక హెపటైటిస్ సి రోగులు పాకిస్థాన్‌లోనే ఉన్నారని వెల్లడి
  • దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది హెపటైటిస్ బి లేదా సి బారిన పడినట్లు అంచనా
  • 6 లక్షల మందికి పైగా నకిలీ వైద్యులే ఈ దుస్థితికి కారణమని రిపోర్ట్
  • పంజాబ్ ఆసుపత్రిలో 331 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ సోకినట్లు వెల్లడి
  • వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన‌ బీబీసీ స్ట్రింగ్ ఆపరేషన్
పాకిస్థాన్‌లో ప్రజారోగ్యం అత్యంత దయనీయ స్థితికి చేరింది. వైద్య వ్యవస్థ నిర్లక్ష్యం, అడ్డూ అదుపూ లేని వైద్య సంస్కృతి కారణంగా ఆ దేశం ప్రపంచంలోనే అత్యధిక హెపటైటిస్ సి (HCV) రోగులతో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా ఉన్న నకిలీ వైద్యులు (క్వాక్ డాక్టర్లు) ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు.

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' ప్రచురించిన ఒక కథనం ప్రకారం దేశంలో హెపటైటిస్ సి బారిన పడిన వారి సంఖ్య సుమారు 1 కోటి వరకు ఉంది. హెపటైటిస్ బి (HBV) బాధితులతో కలిపి చూస్తే, దాదాపు 1.38 కోట్ల నుంచి 1.5 కోట్ల మంది ఈ వైరస్‌లతో జీవిస్తున్నారని, వారిలో కేవలం 25-30 శాతం మందికి మాత్రమే తమకు వ్యాధి ఉన్నట్లు తెలుసని ఆ కథనం పేర్కొంది. ఆసుపత్రులలో వాడిన సిరంజీలను మళ్లీ ఉపయోగించడం, అసురక్షిత రక్త మార్పిడి, సరైన స్టెరిలైజేషన్ పద్ధతులు పాటించకపోవడం వంటి తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించింది. రోగుల భద్రత కంటే లాభాలకే ప్రాధాన్యత ఇచ్చే నకిలీ వైద్యుల క్లినిక్‌లు లక్షలాది మందిని ఈ ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడేలా చేస్తున్నాయని ఆరోపించింది.

ఈ దుస్థితికి అద్దం పట్టేలా, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్స్' నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్‌లో భయంకర వాస్తవాలు బయటపడ్డాయి. తౌన్సాలోని తహసీల్ హెడ్ క్వార్టర్స్ (టీహెచ్‌క్యూ) ఆసుపత్రిలో చికిత్స పొందిన 331 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ సోకినట్లు తేలింది. 2025లో ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించినా, ఆ తర్వాత కూడా అక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని బీబీసీ తన స్ట్రింగ్ ఆపరేషన్‌లో బట్టబయలు చేసింది.

బీబీసీ రహస్యంగా చిత్రీకరించిన వీడియోలలో నర్సులు పిల్లలకు బట్టల పైనుంచే ఇంజక్షన్లు ఇవ్వడం, వాడిన మురికి సిరంజీలనే మళ్లీ వాడటం, అర్హత లేని సిబ్బంది రక్తంతో కలుషితమైన మందులనే చిన్నారులకు ఎక్కించడం వంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సిబ్బంది కొరత, మందుల కొరతతో ఈ దురాగతాలు కొనసాగుతున్నాయని, కొన్నిసార్లు రోగుల కుటుంబ సభ్యులనే మందులు కొనుక్కొని తెచ్చుకోమని సిబ్బంది అడుగుతున్నారని బీబీసీ రిపోర్ట్ పేర్కొంది. ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితం కావడం, క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కొనసాగుతుండటంతో పాకిస్థాన్‌లో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయని స్పష్టమవుతోంది.
Go Back to Shorts
Pakistan Health Crisis
Hepatitis C Pakistan
Fake Doctors Pakistan
Public Health Pakistan
Healthcare System Pakistan
Infected Syringes Pakistan

More Telugu News