ఇక్కడి నుంచి పో.. ముంబై నడిరోడ్డుపై మంత్రిపై మహిళ ఆగ్రహం.. వీడియో ఇదిగో!

  • మంత్రి ర్యాలీతో ముంబైలో భారీ ట్రాఫిక్ జామ్
  • గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న మహిళ
  • మంత్రి గిరీశ్ మహజన్‌ను నడిరోడ్డుపై నిలదీసిన వైనం
  • ఖాళీ ప్రదేశంలో ర్యాలీ చేసుకోండంటూ ఆగ్రహం
ముంబైలో ఓ రాజకీయ ర్యాలీ కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఓ మహిళ, ఏకంగా మంత్రిని, పోలీసులనే నడిరోడ్డుపై నిలదీశారు. మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీశ్ మహజన్ కాన్వాయ్‌ను అడ్డుకుని ఆమె చేసిన వాగ్వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముంబైలోని వర్లీ ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఓ నిరసన ప్రదర్శన చేపట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు జంబోరీ మైదాన్ నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీ ఆలస్యం కావడంతో ఆ ప్రాంతమంతా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

అదే సమయంలో స్కూల్ నుంచి తన బిడ్డను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ఓ మహిళ, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దీంతో సహనం కోల్పోయిన ఆమె కారు దిగి నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మంత్రి గిరీశ్ మహజన్‌తో వాగ్వివాదానికి దిగారు. "వందలాది మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉందిగా! అక్కడికి వెళ్లి చేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్లిపోండి" అంటూ నిరసనకారులపై గట్టిగా అరిచారు.

పోలీసులు జోక్యం చేసుకోబోగా, వారిపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ అధికారులతో మాట్లాడాలని పట్టుబట్టారు. చివరికి పోలీసులు ఆమెను పక్కకు తీసుకెళ్లి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Girish Mahajan
Maharashtra Minister
Mumbai Traffic
Political Rally
Traffic Jam
Worli Mumbai
BJP Protest
Mahayuti Coalition
Women Reservation Bill
Viral Video

More Telugu News