ఉప్పల్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం.. మెంటర్ యువరాజ్ ఏమ‌న్నాడంటే..!

  • ఉప్పల్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ
  • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగులతో హైదరాబాద్ ఘన విజయం
  • అభిషేక్ ఆటపై ప్రశంసలు కురిపించిన మెంట‌ర్‌ యువరాజ్ 
  • నీ బ్యాటే మాట్లాడాలి.. ప్రతీరోజూ మెరుగవుతున్నావంటూ ప్ర‌శంస‌లు
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అభిషేక్ మెరుపులతో సన్‌రైజర్స్ జట్టు 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్, అభిషేక్ శర్మ విశ్వరూపంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఏ దశలోనూ ఢిల్లీ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా అభిషేక్ పరుగుల వరద పారించాడు. 

అనంతరం 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో వికెట్ నష్టానికి 107 పరుగులతో పటిష్ఠంగానే కనిపించింది. అయితే, శ్రీలంక బౌలర్ ఇషాన్ మలింగ (4/32), షకీబ్ హుస్సేన్ (1/29)ల ధాటికి ఢిల్లీ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. అదే స్కోరు వద్ద వరుసగా వికెట్లు కోల్పోయి కోలుకోలేకపోయింది. చివరికి అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరి తన స్థానాన్ని పదిలపరుచుకుంది.

కాగా, అభిషేక్ అద్భుత ప్రదర్శనపై అతడి మెంటర్ యువరాజ్ సింగ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా స్పందించాడు. అభిషేక్ ఆటపై ప్రశంసలు కురిపించాడు. "నీ బ్యాటే మాట్లాడాలి! ప్రతీరోజూ మెరుగవుతున్నావు. బాగా ఆడావు అభిషేక్! ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగించు" అని యువీ ప్రశంసించాడు.

Abhishek Sharma
Yuvraj Singh
Sunrisers Hyderabad

More Telugu News