ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు.. దిగ్బంధం కొనసాగింపు: ట్రంప్ కీలక ప్రకటన

  • ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన ట్రంప్
  • అయితే పోర్టుల దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టీక‌ర‌ణ‌
  • పాకిస్థాన్ నేతల అభ్యర్థన మేరకే ఈ నిర్ణయమన్న అమెరికా అధ్యక్షుడు
  • ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వ్యాఖ్య
  • పాకిస్థాన్‌లో జరగాల్సిన శాంతి చర్చలకు వైస్ ప్రెసిడెంట్ దూరం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ విషయంలో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అదే సమయంలో ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అభ్యర్థన మేరకు ఇరాన్‌పై దాడిని వాయిదా వేసినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో వెల్లడించారు. "ఇరాన్ ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. వారు ఒక ఏకాభిప్రాయంతో ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు సమయం ఇవ్వాలని పాక్ నేతలు కోరారు" అని ట్రంప్ పేర్కొన్నారు.

గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఈ కాల్పుల విరమణ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే, ఇరాన్‌లోని హ‌ర్మూజ్ జలసంధి వద్ద ఉన్న పోర్టులపై దిగ్బంధం కొనసాగుతుందని, అమెరికా సైన్యం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందని ఆయన స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ హాజరు కావడం లేదని వైట్‌హౌస్ ప్రకటించింది. ఇరాన్ నుంచి ఒక స్పష్టమైన ప్రతిపాదన వచ్చి, చర్చలు ముగిసే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Donald Trump
Iran Ceasefire
Hormuz Blockade
US-Iran Relations

More Telugu News