ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు

AP Municipal Workers Strike
  • జీతాల కోసం సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు
  • మార్చి నెల జీతాలు రాకపోవడమే ప్రధాన కారణం
  • పదవీ విరమణ వయసు పెంపు సహా ఇతర డిమాండ్లు
  • రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయే ప్రమాదం
  • స్పష్టమైన హామీ ఇచ్చేవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టీకరణ
ఏపీలో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు. మార్చి నెల జీతాలు ఇప్పటికీ అందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి సమ్మె చేస్తున్నట్లు మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.

సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల రెండు నుంచి నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. మార్చి నెల జీతాల చెల్లింపులో సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నా, పురపాలకశాఖ మంత్రితో చర్చించినా పరిష్కారం కాలేదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

జీతాలతో పాటు మరికొన్ని కీలక డిమాండ్లను కూడా కార్మికులు ప్రభుత్వం ముందుంచారు. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, మరణించిన కార్మికుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని వారు విమర్శిస్తున్నారు.

కార్మికుల సమ్మెతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. చెత్త సేకరణ, డ్రైనేజీ నిర్వహణ వంటి సేవలకు అంతరాయం కలగనుంది. ప్రభుత్వం వెంటనే తమను చర్చలకు పిలిచి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన హామీ లభించే వరకు విధులకు హాజరయ్యేది లేదని వారు స్ప‌ష్టం చేశారు.
Go Back to Shorts
AP Municipal Workers
Strike
Andhra Pradesh

More Telugu News