తరుగు పేరుతో రైతులను దోచుకుంటే సహించేది లేదు: పాడి కౌశిక్ రెడ్డి
- హుజూరాబాద్ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కౌశిక్ రెడ్డి
- తరుగు పేరుతో రైతులను నష్టపరుస్తున్నారని మండిపాటు
- ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్
వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హుజురాబాద్ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మండిపడ్డారు. ముఖ్యంగా 'తరుగు' పేరుతో క్వింటాల్కు కిలోల చొప్పున కోతలు విధిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
"రైతు కన్నీరు పెడితే రాజ్యం బాగుండదు" అని వ్యాఖ్యానించిన ఆయన, ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, విక్రయించిన ధాన్యానికి నగదు సకాలంలో రైతుల ఖాతాల్లో జమ కావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో రైతులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.