నారా లోకేశ్ ఒక సైనికుడిలా ముందడుగు వేసి, కేడర్లో భరోసా నింపారు: గొట్టిపాటి రవి
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా లోకేశ్ వెనకడుగు వేయలేదన్న గొట్టిపాటి
- ఒంగోలు మహానాడు విజయం వెనుక లోకేశ్ ఉన్నారని వ్యాఖ్య
- రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంస
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టబోతున్న నారా లోకేశ్పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో లోకేశ్ ఒక సైనికుడిలా ముందడుగు వేసి కేడర్లో భరోసా నింపారని ఆయన కొనియాడారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, యువగళం పాదయాత్రలో అనేక ఆంక్షలు ఎదురైనా రాష్ట్ర ప్రజల కోసం లోకేశ్ వెనకడుగు వేయకుండా పోరాడారని మంత్రి గుర్తుచేశారు. ఒంగోలులో నిర్వహించిన మహానాడు విజయవంతం కావడం వెనుక లోకేశ్ సమర్థవంతమైన సమన్వయం ఉందని పేర్కొన్నారు.
టీడీపీని కోటి మంది సభ్యత్వం కలిగిన శక్తివంతమైన ప్రాంతీయ పార్టీగా తీర్చిదిద్దిన ఘనత లోకేశ్దేనని ఆయన చెప్పారు. ముఖ్యంగా కార్యకర్తల కోసం 'కార్యకర్తల సంక్షేమ నిధి'ని ఏర్పాటు చేయడం, వారికి ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు.
ఒకవైపు పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో లోకేశ్ అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. విద్యా విధానంలోనూ ఆయన అనేక సంస్కరణలు తీసుకువచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపునిస్తూ, ఆధునిక ఆలోచనలతో పార్టీని నడిపిస్తున్న లోకేశ్ నాయకత్వం రాష్ట్రానికి, పార్టీకి కొండంత అండ అని గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయపడ్డారు.