భారతీయ అత్తింటి వారిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు
- తన మామగారు అమెరికా ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారన్న వాన్స్
- ఆయనను చూసి తాను గర్విస్తున్నానని వ్యాఖ్య
- అమెరికా పౌరసత్వం అంటే దేశ ప్రయోజనాలకు కట్టుబడి ఉండటమేనని ఉద్ఘాటన
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భారతీయ అత్తింటి కుటుంబంపై ప్రశంసల వర్షం కురిపించారు. జార్జియా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... అమెరికాను సుసంపన్నం చేయడంలో వలసదారులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. ముఖ్యంగా భారత్ నుండి వచ్చి ఇక్కడి పౌరసత్వం పొందిన తన మామగారు, అమెరికా ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, ఆయనను చూసి తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు. వలసదారులు ఈ దేశానికి చేస్తున్న సేవలను ప్రశంసిస్తూనే, ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్పై కఠినమైన నియంత్రణ ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన సమర్థించారు.
ఈ సందర్భంగా హెచ్-1బీ వీసా వ్యవస్థలో జరుగుతున్న మోసాల గురించి వాన్స్ ప్రస్తావించారు. గ్రీన్కార్డుల కోసం భారత సంతతి వ్యక్తులు ఎదురుచూస్తున్న సుదీర్ఘ నిరీక్షణపై స్పందిస్తూ... అమెరికా పౌరసత్వం అంటే దేశ ప్రయోజనాలకు కట్టుబడి ఉండటమేనని స్పష్టం చేశారు. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన తెలుగు కుటుంబానికి చెందినవారన్న సంగతి తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు 1980ల్లోనే అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
మరోవైపు, ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారంపై కూడా వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న అపనమ్మకం రాత్రికి రాత్రే తొలగిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఇరాన్ ప్రతినిధులు ఒప్పందం కోసం ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా మరోసారి శాంతి చర్చలు జరగనున్నాయని ట్రంప్ చెప్పిన నేపథ్యంలో, ఈ నెల 21న ముగియనున్న కాల్పుల విరమణ గడువులోపు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.