వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీని తిప్పికొట్టాలి: టీడీపీ క్యాడర్‌కు నారా లోకేశ్ దిశానిర్దేశం

Nara Lokesh TDP Cadre Must Counter YCP Fake Propaganda
  • క్లస్టర్ ఇన్‌చార్జులతో నారా లోకేశ్ 'కాఫీ కబుర్లు'
  • పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేడర్‌కు పిలుపు
  • ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేయాలని సూచన
  • నా రెడ్ బుక్ సమాజం కోసమైతే, జగన్ రాజారెడ్డి రాజ్యాంగం విధ్వంసం  కోసమని విమర్శలు
  • కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయాలని హితవు
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, సిద్ధాంతపరమైన పునాదులే నాయకత్వానికి అసలైన బలమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో భాగంగా నిర్వహించిన 'కాఫీ కబుర్లు' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్, తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటిన చంద్రబాబు బలమైన సిద్ధాంతాలతోనే విజయాలు సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఏ ఆత్మ చెప్పిందో గానీ...!

గత వైసీపీ పాలనలో జరిగిన దమనకాండను లోకేశ్ గుర్తుచేశారు. “దేవాలయంలాంటి టీడీపీ కార్యాలయంపై, చంద్రబాబు గారి ఇంటిపై దాడులు చేశారు. అమర్నాథ్ గౌడ్, అబ్దుల్ సలాం, తోట చంద్రయ్య వంటి వారిని వెంటాడి చంపారు. డాక్టర్ సుధాకర్, కోడెల శివప్రసాద్, చిన్నారి మిస్బా మరణానికి కారణమయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం, దాడులు, హత్యలు, అవినీతితో రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్, ఇప్పుడు అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వంపై విష ప్రచారానికి దిగుతున్నారు. వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే అసత్యాలను ఐక్యంగా తిప్పికొట్టాలి. నా రెడ్ బుక్ సమాజ హితం కోసమైతే, రాజారెడ్డి రాజ్యాంగంతో జగన్ సమాజాన్ని నాశనం చేయాలనుకున్నారు. ఏ ఆత్మ చెప్పిందో కానీ, ‘మావిగన్’ అంటూ కలవరిస్తున్నారు” అని లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఆరు సిద్ధాంతాలను గ్రామస్థాయికి చేర్చాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, వాటి వెనుక ఉన్న పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం అత్యంత కీలకమని లోకేశ్ స్పష్టం చేశారు. “కార్యకర్తల మధ్య ఐక్యత, క్రమశిక్షణ పార్టీని మరింత బలోపేతం చేస్తాయి. సిద్ధాంతాలపై ఆధారపడి ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటేనే దీర్ఘకాలిక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయి. ఎన్ని పనులున్నా ముఖ్యమంత్రి గారు, నేను ప్రతి వారం పార్టీ కార్యాలయంలో గడుపుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా పార్టీ కోసం కొంత సమయం కేటాయించాలి. పార్టీ రూపొందించిన ఆరు ముఖ్య సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించాలి” అని ఆయన వివరించారు.

కూటమి ధర్మాన్ని పాటిద్దాం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటం వల్లే అమరావతికి చట్టబద్ధత, విశాఖ ఉక్కు పరిరక్షణ, ప్రత్యేక నిధుల సాధన వంటివి సాధ్యమవుతున్నాయని లోకేశ్ తెలిపారు. నాయకులంతా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన, బీజేపీ నేతలతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. “కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు వస్తే ఎలా కూర్చుని మాట్లాడుకుంటామో, అలాగే కూటమి నేతలు కూడా ఒక కుటుంబంలా భావించి ఏవైనా సమస్యలుంటే చర్చించుకుని పరిష్కరించుకోవాలి” అని ఆయన హితవు పలికారు. 'మై టీడీపీ' యాప్ ద్వారా కార్యకర్తలు తమ కార్యకలాపాలను నమోదు చేయాలని, ప్రతి ఒక్కరి పనితీరును అధినేత పర్యవేక్షిస్తున్నారని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు.
Go Back to Shorts
Nara Lokesh
TDP
YCP Fake Factory
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Amaravati
Visakha Steel Plant
Telugu Desam Party
Coalition Government
My TDP App

More Telugu News