ఐపీఎల్ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

  • ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వీడిన బ్లెస్సింగ్ ముజరబానీ
  • జింబాబ్వే పేసర్‌పై రెండేళ్ల పాటు పీసీబీ నిషేధం
  • పీఎస్ఎల్‌లో ఆడాల్సి ఉండగా కేకేఆర్‌ జట్టుకు మారిన వైనం
  • ఒప్పంద ఉల్లంఘన కారణంగానే ఈ చర్యలన్న పాక్ బోర్డు
  • కేకేఆర్ తరఫున ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన ముజరబానీ
ఐపీఎల్ కోసం, పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కు చివరి నిమిషంలో దూరమైన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది. పీఎస్ఎల్‌లో రెండేళ్ల పాటు ఆడకుండా అతనిపై నిషేధం విధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

వాస్తవానికి, 29 ఏళ్ల ముజరబానీ ఐపీఎల్, పీఎస్ఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. అయితే, పీఎస్ఎల్ ఫ్రాంచైజీ ఇస్లామాబాద్ యునైటెడ్ అతడిని రీ‌ప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా తీసుకుంది. కానీ, అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కూడా ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ముజరబానీ పీఎస్ఎల్ కాకుండా ఐపీఎల్‌లో ఆడేందుకే మొగ్గు చూపాడు.

ఈ పరిణామంపై క్రమశిక్షణ చర్యలు చేపట్టిన పీసీబీ, ముజరబానీపై రెండేళ్ల నిషేధం విధించింది. ఒప్పందాలను ఉల్లంఘించడం, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. పీఎస్ఎల్ ప్రతిష్ఠను, వృత్తిపరమైన వాతావరణాన్ని కాపాడేందుకే ఈ కఠిన చర్యలు అవసరమని పేర్కొంది. గత ఏడాది కూడా ఇలాగే ప్రవర్తించిన కార్బిన్ బాష్‌పై పీసీబీ ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, ముజరబానీ ఇప్పటికే కేకేఆర్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముజరబానీతో పాటు స్పెన్సర్ జాన్సన్, దసున్ షనక కూడా పీఎస్ఎల్ ఒప్పందాలను వదులుకుని ఐపీఎల్‌లో చేరారు. వీరిపై పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Blessing Muzarabani
Zimbabwe bowler
Pakistan Cricket Board
PSL ban
IPL
Kolkata Knight Riders
cricket controversy
player contracts
sports ethics
disciplinary action

More Telugu News