జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ: జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు

జగిత్యాలలో ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కోసం గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధమవుతున్నాయి. సుమారు లక్ష మంది జనసమీకరణే లక్ష్యంగా పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు సంబంధించి అనువైన ప్రదేశాన్ని ఖరారు చేసేందుకు ఈరోజు పార్టీ ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ వసంత తదితరులు కలిసి జగిత్యాలలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానం, ఓల్డ్ బస్టాండ్ సమీపంలోని కాలేజీ గ్రౌండ్, మోతే రోడ్డు ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు.


ఈ బహిరంగ సభకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడటానికి ప్రధాన కారణం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మాజీ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికారికంగా పార్టీలో చేరనుండటమే. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చితే ఈ రెండేళ్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ భారీ సభ ద్వారా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ తన పట్టును మరోసారి నిరూపించుకోవాలని భావిస్తోంది.


Jeevan Reddy
BRS meeting
KCR
Telangana politics
Jagtial
BRS rally
Revanth Reddy government
Telangana development
Congress party Telangana
Telangana news

More Telugu News