పల్నాడులో ఏఎస్సై బాగోతం.. జంటలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్!

పల్నాడు జిల్లాలో ఓ ఏఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది. ఏకాంతంగా గడుపుతున్న జంటలను లక్ష్యంగా చేసుకుని, వారిని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందాకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమికులు, కళాశాల విద్యార్థులే లక్ష్యంగా ఈ ఏఎస్సై దందాలకు పాల్పడుతున్నాడు. జమ్మలమడుగుకు చెందిన ఓ ఆటోడ్రైవర్ సాయంతో జంటలు సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీయించి, వారిని స్టేషన్‌కు తీసుకెళ్తానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వలేని యువతులను తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధిస్తున్నట్లు కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల మాచర్లలోని ఓ వ్యాపారి, మహిళతో ఏకాంతంగా ఉన్న వీడియో తీసి, వారిని బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఇదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మరో ఎస్సై, కానిస్టేబుల్‌కు కూడా ఈ దందాలో భాగం ఉందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు స్పందించారు. సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Krishna Rao
Palnadu ASI
Andhra Pradesh Police
blackmail case
Macharla
sexual harassment
crime news
extortion
video scandal
police investigation

More Telugu News