టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పెరిగిన కరవు భత్యం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కరవు భత్యం (డీఏ) 2.1 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. తాజా పెంపుతో ఆర్టీసీ ఉద్యోగుల డీఏ 50.7 శాతం నుంచి 52.8 శాతానికి చేరింది. ఈ నిర్ణయంతో సుమారు 38 వేల మందికి పైగా ఆర్టీసీ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది.

డీఏ పెంపు నిర్ణయం 2026 జనవరి నుంచే అమల్లోకి వస్తుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల బకాయిలను రాబోయే నెలల్లో సప్లిమెంటరీ బిల్లుల ద్వారా విడతలవారీగా చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ డీఏ పెంపు వల్ల ఆర్టీసీపై ప్రతి నెలా అదనంగా రూ.2.82 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు.

సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఏటా జనవరి, జులై నెలల్లో డీఏను సవరిస్తారు. గత ఏడాది జులైలో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం 2.1 శాతం డీఏ పెంచింది. తాజాగా మరోసారి డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' పథకం ఆర్టీసీకి ఆర్థికంగా ఊతమిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగి, సంస్థ ఆదాయం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి ఆర్టీసీ సుమారు రూ.954 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి చెల్లిస్తుండటంతో సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో కొత్త బస్సులను కొనుగోలు చేసి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా లాభాలను మరింత పెంచుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది.

TGSRTC
Ponnam Prabhakar
Telangana RTC
DA Hike
Dearness Allowance
RTC Employees
Mahalakshmi Scheme
Telangana Government
Bus Services
Public Transportation

More Telugu News