ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ‌ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగే ఈ సమావేశం కోసం జీవన్ రెడ్డికి మధ్యాహ్న భోజనానికి ఆహ్వానం అందింది. ఈ భేటీలో బీఆర్ఎస్‌లో చేరే తేదీతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు కొప్పుల ఈశ్వర్, ఎల్. రమణ, దామోదర్ రావు, గంగుల కమలాకర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత జీవన్ రెడ్డి చేరికపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అంతకుముందు గురువారం, కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల నేతలతో కలిసి గంటకు పైగా జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌తో జీవన్ రెడ్డికి మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు.

Jeevan Reddy
KCR
BRS
Telangana Politics
Errvalli Farmhouse
KTR
Congress Party
Karimnagar
Lunch Meeting
Political News

More Telugu News