'మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్

వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సెటైర్ వేశారు. ఏపీ రాజధానిగా జగన్ 'మావిగన్' (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్‌ను ప్రతిపాదించడంపై ఎద్దేవా చేసిన చంద్రబాబు, "రాజధానిగా వాటికన్‌ను సూచించనందుకు సంతోషం" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక, శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

గురువారం బాపట్ల జిల్లా వేమూరులో జరిగిన ఓ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలే కాకుండా మొత్తం 49 పార్టీలు మద్దతిచ్చాయని, కేవలం వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని గుర్తుచేశారు. "గతంలో ఒక నాయకుడిని సైకో అనేవాళ్లం, ఇప్పుడు ఆ పార్టీ మొత్తమే సైకోగా మారింది" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గతంలో అమరావతి మహిళలను, అసెంబ్లీలో తన భార్యను అవమానించిన వైసీపీ ఇప్పుడు మహిళల గౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు విమర్శించారు. "ఒక సైకో ప్రవర్తనతో రౌడీ బ్యాచ్ పైశాచిక వాదనలు చేస్తోంది. మహిళలను వేధించారు. పత్రికపై దాడి చేశారు. వీటికి ఆ సైకో పార్టీ ఎలాంటి వివరణ ఇచ్చుకోలేని స్థితిలో ఉంది" అని అన్నారు. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపిన ప్రాంతమే సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) అనే విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. "విధ్వంసం చేసే వ్యక్తులు స్వేచ్ఛగా తిరిగితే రాష్ట్రంలోని మహిళలకు భద్రత ఎలా ఉంటుంది? అలాంటి వారిని అరెస్టు చేయడానికి నాకు నిమిషం పట్టదు, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని హెచ్చరించారు. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మొదలైందని, విధ్వంసకర శక్తులను ఐక్యంగా ఓడించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

Chandrababu Naidu
Jagan Mohan Reddy
Amaravati
Andhra Pradesh
AP Capital
YSRCP
Telugu Desam Party
AP Politics
Machilipatnam
Vijayawada
Guntur

More Telugu News