ఏపీలో విభిన్న వాతావరణం.. కోస్తాలో వానలు, సీమలో భగభగలు

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాయలసీమలో ఎండలు మండిపోతుండగా, మరోవైపు కోస్తా జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోందని ఆయన తెలిపారు. దీని ప్రభావంతో గురువారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని ప్రత్యేకంగా హెచ్చరించారు.

మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా చిత్తూరు, నంద్యాల, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వివరించారు.

 

Prakhar Jain
Andhra Pradesh weather
AP weather
Rayalaseema heatwave
Coastal Andhra rains
AP disaster management
Heatwave alert
Rainfall forecast
Lightning strikes
IMD forecast

More Telugu News