ఇరాన్ నుంచి చైనా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ రూటు మార్చి భారత్ వైపు మళ్లింపు

ఇరాన్ నుంచి చైనా బయలుదేరిన ఒక ఆయిల్ ట్యాంకర్ రూటు మార్చి భారత్ వైపు వస్తున్నట్లు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ (ఎల్ఎస్ఈజీ) షిప్పింగ్ డేటా వెల్లడించింది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడిచమురుపై ఇటీవల అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీనితో ఇరాన్ ముడి చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అతిపెద్ద చమురు రవాణా నౌక 'జయ' తొలుత ఇరాన్ నుంచి ఆగ్నేయాసియా జలాల వైపు ప్రయాణించింది. ఈ నౌక గమ్యస్థానం చైనా వైపు చూపించింది. అయితే ఈ నౌక అనూహ్యంగా రూటు మార్చి భారత్ వైపు వస్తున్నట్లు ఎల్ఎస్ఈజీ షిప్పింగ్ డేటా తెలిపింది. ఈ చమురు నౌక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ)కి చెందినదిగా తెలుస్తోంది. అయితే కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జోర్డాన్ అనే మరో నౌక గమ్యస్థానం కూడా భారత్ వైపు సూచిస్తోందని తెలుస్తోంది.

ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా 2019 నుంచి ఆ దేశం నుంచి చమురు దిగుమతులు నిలిచిపోయాయి. తాజాగా ఇరాన్‌ చమురుపై ఆంక్షలు తాత్కాలికంగా ఎత్తివేసిన నేపథ్యంలో ఏడేళ్ల తర్వాత తొలిసారి ఇరాన్ చమురు భారత్‌కు వస్తోంది. ఇదిలా ఉండగా, ఇరాన్ నుంచి భారత్‌కు వస్తున్న చమురు నౌక 'పింగ్ షున్' ఇటీవల తన గమ్యస్థానాన్ని చైనా వైపు మళ్లించడం తెలిసిందే.

Iran oil tanker
Iran
oil tanker
India
China
crude oil
Indian Oil Corporation
IOC
US sanctions

More Telugu News