మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి జూపల్లి
తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, ఒక సామాన్య ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నగరంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా, ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకుని త్వరగా చేరుకోవడానికి మంత్రి మెట్రోను ఎంచుకున్నారు. సెక్యూరిటీ హడావుడి లేకుండా ఎర్రమంజిల్ స్టేషన్లో స్వయంగా టికెట్ కొనుగోలు చేసి మియాపూర్ వరకు ప్రయాణించారు.
రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, మంత్రి తన హోదాను పక్కన పెట్టి తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే వెళ్లారు. ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులతో సరదాగా మాట్లాడారు. మెట్రో సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రిని తమ మధ్య చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా, జూపల్లి ఎంతో ఓపికగా అందరితో ఫొటోలు దిగారు.
సమయాన్ని ఆదా చేస్తూ, ట్రాఫిక్ చిక్కులు లేకుండా గమ్యస్థానాలకు చేరడానికి మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ ఆయన ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్బీ వరకు ఇలాగే ప్రయాణించి వార్తల్లో నిలిచారు.