300 కి.మీ పైగా వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలి: మంత్రి మండిపల్లి

రాష్ట్రంలో బస్సు ప్రమాదాల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. 300 కిలోమీటర్లకు మించి ప్రయాణించే అన్ని బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లను నియమించేలా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి నిన్న రవాణా, పోలీస్, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇటీవల కర్నూలు, మార్కాపురం, మారేడుమిల్లి ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చాలా ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అవసరమైతే స్లీపర్ బస్సులను రద్దు చేసే అంశాన్ని కూడా చర్చిస్తున్నామని, ఈ విషయమై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని మంత్రి వెల్లడించారు.

ప్రమాదాల నియంత్రణలో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై స్పీడ్ గన్ల ఏర్పాటుకు రూ.40 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. త్వరలోనే వీటికి టెండర్లు పిలుస్తామన్నారు. బస్సుల్లో డ్రైవర్ల కదలికలను పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. గత 10 రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌లలో 10 వేల వాహనాలను తనిఖీ చేశామని, నిరంతర పర్యవేక్షణ కోసం 13 నుంచి 16 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్న బస్సులను ఏపీలోనే రిజిస్టర్ చేసేలా ప్రోత్సహించడానికి సీటుపై పన్ను తగ్గించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Mandipalli Ramprasad Reddy
Andhra Pradesh bus accident
AP transport minister
bus safety measures
sleeper bus ban
speed guns highways
driver monitoring system
AP checkposts
bus registration tax
Vangala Pudi Anita

More Telugu News