ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కు పరిమితం: హరీశ్ రావు

ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవబోదని, సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను కలవడానికి బయలుదేరడంతో పోలీసులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. శంషాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు, ఆ తర్వాత వారిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, తాను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని వ్యాఖ్యానించారు. గత రెండున్నరేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సింగిల్ డిపాజిట్‌కు పరిమితమవుతుందని అన్నారు.

ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదని, ఆందోళనలు, ధర్నాలు నిర్వహించరాదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు, విచారణలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తమను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. రైతులను పరామర్శించేందుకు వెళుతుంటే అరెస్టు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో రామరాజ్యం లాంటి కేసీఆర్ రాజ్యం వస్తుందని అన్నారు.

Harish Rao
Telangana
Congress Party
BRS
Revanth Reddy
Telangana Elections
Sabitha Indra Reddy

More Telugu News