హరీశ్ రావు హౌస్ అరెస్ట్... పరిగి వెళ్లితీరుతానన్న హరీశ్
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై హరీశ్ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల భూములపై దండయాత్ర చేస్తోందని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్, భువనగిరి వంటి ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో లాక్కునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు కోటి రూపాయల విలువైన భూమిని రూ. 10-20 లక్షలకే గుంజుకుంటోందని ధ్వజమెత్తారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్ట్ చేయడం, టెంట్లను పీకేయడం 'ప్రజాపాలన' అనిపించుకోదని, ఇది పేదల పొట్ట కొట్టే 'భక్షక పాలన' అని దుయ్యబట్టారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుని, 22A నిషేధిత జాబితాను రివ్యూ చేసే వరకు రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాటం ఆపదని స్పష్టం చేశారు.
వికారాబాద్ జిల్లాకు సీఎం, స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా, అది జిల్లాకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనను అడ్డుకోలేరని, బాధితులను పరామర్శించేందుకు కచ్చితంగా పరిగి వెళ్లి తీరుతానని హరీశ్ రావు హెచ్చరించారు.