హైదరాబాద్ పాతబస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది: బండి సంజయ్

హైదరాబాద్ పాతబస్తీలో శాంతిభద్రతలు క్షీణించాయని, అక్కడ బెంగాలీ కుటుంబాలు నివసించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పాతబస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూల్ అమలు చేస్తున్నారా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు.

నిన్న రాత్రి పాతబస్తీలోని బెంగాలీ కుటుంబాలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాతబస్తీలో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన జీహెచ్‌ఎంసీ అధికారులపై ఎంఐఎం నేతలు దాడి చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అదే ఇతర ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే లాఠీఛార్జులు, కేసులు పెడుతున్నారని ఆయన గుర్తుచేశారు.

'ముఖ్యమంత్రి గారూ.. పాతబస్తీని ఏమైనా మజ్లిస్‌‌కు రాసిచ్చారా? ఎంఐఎం నేతలు దాడులు, దౌర్జన్యాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా?' అని బండి సంజయ్ నిలదీశారు. ఎంఐఎం గూండాల కారణంగా బెంగాలీలు ఇబ్బందులు పడుతున్నారని, వేల సంఖ్యలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు నగరంలోకి అక్రమంగా చొరబడి ఓటర్ కార్డులు కూడా పొందారని ఆరోపించారు. అధికారులపై దాడులు చేసేవారిపై చర్యలు తీసుకోకపోతే పాతబస్తీలో పరిస్థితులు చేయిదాటిపోతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని అక్కడి బెంగాలీ సమాజాన్ని ఆయన కోరారు.
 

Bandi Sanjay
Hyderabad
Old City
Bengali Community
MIM
Revanth Reddy
Telangana Politics
Illegal Constructions
Law and Order
Bangladeshi Immigrants

More Telugu News