Donald Trump: ట్రంప్ హెచ్చరికల వెంటే టెహ్రాన్‌పై భీకర దాడులు.. 13 మంది మృతి!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా క్షిపణుల దాడులకు పాల్పడ్డాయి. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో 13 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగానే అమెరికా ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.

టెహ్రాన్‌లోని కీలక ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడులు జరిగాయి. ఈ ఘటనలో ప్రఖ్యాత షరీఫ్ యూనివర్సిటీ భవనంతో పాటు సమీపంలోని గ్యాస్ పైప్‌లైన్ కూడా ధ్వంసమైంది. దాడుల సమయంలో యూనివర్సిటీలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని విద్యా సంస్థలన్నీ ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని ఇరాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలను నామరూపాల్లేకుండా చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ‘నరకం అంటే ఏంటో చూపిస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించిన కొద్ది రోజులకే ఈ దాడులు జరగడం గమనార్హం.

ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. ట్రంప్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఇరాన్ సాంస్కృతిక మంత్రి రెజా సాల్హీ అమిరీ విమర్శించారు. ప్రస్తుతం టెహ్రాన్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 
Donald Trump
Iran
Tehran
US Israel attacks
Middle East tensions
Sharif University
Hormuz Strait
Iran military command
Reza Salehi Amiri
World war

More Telugu News