Srikakulam: శ్రీకాకుళంలో కలకలం.. బాదం పాలు తాగి 80 మందికి అస్వస్థత

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. గ్రామీణ మండలం సింగుపురంలో బాదం పాలు వికటించి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో వారిని ఆసుప‌త్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... సింగుపురంలో ఈ నెల‌ 1, 2 తేదీల్లో కొండమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ జాతర సందర్భంగా ఓ వ్యక్తి వ్యాన్‌లో బాదం పాలు విక్రయించాడు. ఎండ తీవ్రంగా ఉండటంతో ఉత్సవాలకు వచ్చిన పలువురు ఈ పాలను కొనుగోలు చేసి తాగారు. అయితే, గురువారం అర్ధరాత్రి నుంచి పాలు తాగిన వారికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం వంటి లక్షణాలు మొదలయ్యాయి. దీంతో బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆసుప‌త్రులకు తరలించారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాధితులంతా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. జాతరలో నాణ్యత లేని పానీయం అమ్మడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Srikakulam
Srikakulam district
Badam milk
Food poisoning
Singupuram
Kondamma Thalli festival
Andhra Pradesh
Illness
Hospitalization

More Telugu News