YSRCP: మాపై వివక్ష చూపారు: ఉపరాష్ట్రపతికి వైసీపీ ఎంపీల ఫిర్యాదు
రాజధాని అమరావతి బిల్లుపై పార్లమెంట్లో జరిగిన చర్చలో తమకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. రాజ్యసభలో తమ పార్టీకి ఏడుగురు ఎంపీలు ఉన్నప్పటికీ, కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారని వారు ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం 20 నిమిషాల సమయం కేటాయించడాన్ని వారు తప్పుబట్టారు.
తాము అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ తమపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లులో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు జరిగే న్యాయంపై ఎటువంటి స్పష్టత లేదని వారు పేర్కొన్నారు. గుంటూరు - మచిలీపట్నం కారిడార్ను సమగ్రంగా అభివృద్ధి చేయాలని జగన్ కోరిన విషయాన్ని వారు ఉపరాష్ట్రపతికి వివరించారు.
చట్టసభల్లో తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని, సంఖ్యాబలం ఉన్న పార్టీలకు తగిన సమయం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. రాజధాని విషయంలో తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.