Vikram Misri: హర్మూజ్ సంక్షోభం.. పౌరులను కోల్పోయింది మేమేనన్న భారత్

వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు బ్రిటన్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సంఘర్షణలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో తమ పౌరులను (నావికులను) కోల్పోయిన ఏకైక దేశం తమదేనని స్పష్టం చేసింది. 60కి పైగా దేశాలు పాల్గొన్న ఈ వర్చువల్ సమావేశంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి పాల్గొన్నారు. సముద్రయాన స్వేచ్ఛ సూత్రాలను గౌరవించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించి, దౌత్యం, చర్చల మార్గాన్ని ఎంచుకోవడమే ఈ సంక్షోభానికి ఏకైక పరిష్కారమని భారత్ పునరుద్ఘాటించింది. గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల వల్ల ఇప్పటివరకు ముగ్గురు భారతీయ నావికులు మరణించారని విదేశాంగ శాఖ గుర్తుచేసింది. ఈ సంక్షోభం భారత్ ఇంధన భద్రతపై చూపుతున్న ప్రభావాన్ని కూడా మిస్రి వివరించారు.

ఇప్పటికే ఇరాన్ వంటి దేశాలతో చర్చలు జరిపి, గత కొన్ని రోజుల్లో ఆరు భారత నౌకలు ఈ జలసంధిని సురక్షితంగా దాటేలా చూశామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత నౌకల ప్రయాణానికి ఇరాన్‌తో ఎలాంటి టోల్ ఒప్పందాలు లేవని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే, బ్రిటన్ నిర్వహించిన ఈ కీలక సమావేశానికి అమెరికా హాజరు కాలేదు. ఇది తమ సమస్య కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇరాన్ బందీగా మార్చిందని, సైనిక చర్యల కన్నా రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారాలపై దృష్టి పెట్టాలని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి వైవెట్ కూపర్ పిలుపునిచ్చారు.
Vikram Misri
Hormuz Strait
India
Iran
Maritime Security
Gulf Region
Indian Navy
Oil Tanker Attacks
West Asia Crisis
UK Meeting

More Telugu News