Telangana ERC: తెలంగాణలో కరెంట్ షాక్‌తో చనిపోతే రూ.8 లక్షలు.. ఛార్జీల పెంపు లేదు: టీ-ఈఆర్సీ కీలక నిర్ణయాలు

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. రాష్ట్రంలో ఎవరైనా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మరణిస్తే ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండబోదని స్పష్టం చేసి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ఆర్డర్‌ను తాజాగా ఈఆర్సీ విడుదల చేసింది.

విద్యుత్ ప్రమాద మృతులకు భారీగా పెరిగిన పరిహారం.. 2 నెలల్లోనే చెల్లింపు
ఇప్పటివరకు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తుండగా, దానిని మరో రూ.3 లక్షలు పెంచి రూ.8 లక్షలు చేసింది. ఈ పెంచిన పరిహారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. బాధితుడి కుటుంబానికి రెండు నెలల్లోపే ఈ సొమ్మును అందించాలని, జాప్యం జరిగితే అందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా వివరించాలని డిస్కంలను ఆదేశించింది. వినియోగదారుడి తప్పిదం వల్ల ప్రమాదం సంభవించినా ఈ పరిహారం వర్తిస్తుందని స్పష్టం చేయడం గమనార్హం.

పాత ఛార్జీలే కొనసాగింపు
మరోవైపు ఈ ఏడాది కూడా పాత కరెంట్ ఛార్జీలనే కొనసాగించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఛార్జీల పెంపు ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. దీంతో పాటు ఇళ్ల పైకప్పులపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్లాంట్ల వినియోగదారులకు ఊరట కల్పించింది. అదనపు యూనిట్ల వాడకంపై అధిక శ్లాబుల ప్రకారం వసూలు చేసిన అదనపు మొత్తాన్ని రాబోయే మూడు నెలల బిల్లుల్లో సర్దుబాటు చేయాలని డిస్కంలను ఆదేశించింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలుకు రూ.49,230 కోట్లకు, ఇతర వ్యయాలతో కలిపి మొత్తం రూ.64,950 కోట్లకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. అయితే, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ల ఆదాయ, వ్యయాల మధ్య సుమారు రూ.15,106 కోట్ల లోటు ఏర్పడుతుందని ఈఆర్సీ అంచనా వేసింది. ఈ లోటును భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.14,000 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి అంగీకరించిందని తెలిపింది. మిగిలిన లోటును డిస్కంల రెగ్యులేటరీ ఆస్తిగా పరిగణించాలని సూచించింది.
Telangana ERC
Telangana
TNERC
Electricity
Power shock
Compensation
Current charges
Power tariff

More Telugu News