Chandrababu Naidu: శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన అందిస్తాం: ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబు

శ్రీరాముడి ఆశీస్సులతో, ఆయన చూపిన మార్గంలో ధర్మాన్ని అనుసరించి రాష్ట్రంలో ధర్మబద్ధమైన పాలన అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాముడి పేరు వినగానే సుపరిపాలన, రామరాజ్యం గుర్తుకు వస్తాయని, అదే స్ఫూర్తితో తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆయన తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

అంతకుముందు, ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ నయనానందకరమైన కల్యాణ వేడుకను వేలాది మంది భక్తులు కనులారా వీక్షించారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించి, స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా 'జై శ్రీరామ్' నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సంపద, ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని శ్రీరాముడిని ప్రార్థించినట్లు తెలిపారు. "రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్ట ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసి, ఏటా బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ రోజు మనకు ఎంతో పవిత్రమైనది" అని అన్నారు.

ఇదే రోజు లోక్‌సభలో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. "పూర్వం దేవేంద్రుడు పాలించిన రాజధాని అమరావతి అయితే, నేడు మనం నిర్మిస్తున్నది ప్రజారాజధాని అమరావతి. శ్రీరాముని ఆశీస్సులతో ధర్మాన్ని పాటించి మీకు అండగా ఉంటాం. రామరాజ్యంలాగే మీకు సుపరిపాలన అందిస్తాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Ontimitta
Sri Rama Navami
Seetha Rama Kalyanam
TTD
Amaravati
Hindu festival
Kadapa district
Ramrajya

More Telugu News