Chandrababu Naidu: అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా: ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to Directly Review Government Official Performance
షార్ట్స్‌లో చూడండి
పరిపాలనలో ఎలాంటి లోపాలు.. అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపై ఉన్నతస్థాయి ఉద్యోగులు మొదలుకుని... క్షేత్ర స్థాయిలో పని చేసే ఉద్యోగులందరి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామని చెప్పారు. పనితీరు బాగున్న అధికారులను మరింత ప్రొత్సహిస్తామని... పనితీరు సరిగా లేని వారిని గాడిలో పెడతామని.. అప్పటికీ మారకుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. ఇకపై జిల్లాల పర్యటనకు వెళ్లే సందర్బంలో వివిధ శాఖల పనితీరును నేరుగా పరిశీలిస్తానని వెల్లడించారు.
 
మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...'ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. వీటిని సమర్థవంతంగా అమలు చేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటూనే... వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని కూడా అంతే ప్రాధాన్యతగా తీసుకోవాలి. జిల్లాల్లోని పరిపాలనా యంత్రాంగం కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలి. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా... ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను, అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ మేరకు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ల సేవలు వినియోగించుకోవాలి. 

ఇకపై నేను జిల్లాల పర్యటనలకు వెళ్లిన సందర్భాల్లో పరిస్థితిని బట్టి ఆకస్మిక తనిఖీలు చేస్తాను. శాఖల పనితీరును.. అధికారులు, ఉద్యోగుల పనితీరును కూడా క్షేత్ర స్థాయిలోనే విశ్లేషిస్తా. ప్రజలకు వాస్తవాలను స్వయంగా నేనే వివరిస్తాను. ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందనే విషయం ప్రజలకు అర్థం కావాలి. అధికారులు, ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించుకునేలా చూస్తాం. ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఏమైనా సాంకేతిక, పరిపాలనా పరమైన ఇబ్బందులుంటే వాటిని తొలగించాలి. ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేలా.. వారికి అవసరమైన శిక్షణ ఇస్తాం. ఈ మేరకు అమరావతిలో రాష్ట్రస్థాయి శిక్షణ కేంద్రాన్ని, వివిధ ప్రాంతాల్లో జోనల్ వారీగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి.'అని ముఖ్యమంత్రి సూచించారు.
 
కుల ధ్రువీకరణ పత్రాల జారీలో లోటుపాట్లను సరిదిద్దాలి
 
“ప్రభుత్వం అందించే ప్రతి సేవలో ప్రజా కోణం అనేది మరిచిపోకూడదు. మనం అందించే సేవలు ప్రజలకు చేరువ కావడంతోపాటు... వారిని సంతృప్తి పరిచేలా చూడాలి. ప్రభుత్వం మన కోసం ఉంది.. మనకు అండగా నిలిచేందుకు ఉంది అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించేలా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలి. ఎలాంటి ఫలితం ఆశించకుండా... ప్రజలకు అద్భుతంగా సేవలందించే ఉద్యోగులు ఉంటారు. సంజీవని సహా వివిధ ప్రభుత్వ సేవలను టెక్నాలజీ ద్వారా ఏ విధంగా అందుకోవచ్చనే అంశంపై ప్రజలకు అగాహన కల్పించాలి. అలాంటి వారికి గుర్తింపు దక్కేలా చూస్తాం. కుల ధృవీకరణ పత్రాల విషయంలో కొన్ని పొరపాట్లు చోటు చేసుకుంటన్నాయి. పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్ల కారణంగా కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో తేడాలు జరిగాయి. అలాంటి వాటిని సరి చేయాలి. కుల ధ్రువీకరణ పత్రాలు దుర్వినియోగం కాకుండా అధికారులు శ్రద్ధ తీసుకోవాలి. శాంతి భద్రతల విషయంలో... మిస్సింగ్ పర్సన్స్ ట్రేస్ చేసే అంశంలో, సంఘ విద్రోహ శక్తులను గుర్తించే విషయంలో టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. సీసీటీవీ నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేసుకోవాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతలో ఉన్న టాలెంట్ వెలికి తీయాలి. స్టార్టప్ కంపెనీలను ప్రొత్సహించాలి. ఎన్విడియా వంటి ప్రముఖ సంస్థలతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎంఓయూ కుదుర్చుకుని కలిసి పని చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కేంద్రాలను త్వరలో సందర్శిస్తాను. యూనివర్శిటీల్లో కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అందిస్తున్న సేవలను ప్రమోట్ చేయాలి. కుప్పంలో ఆగస్త్య వంటి సంస్థలు పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీస్తున్నాయి. అలాంటి సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరపాలి. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
Government Performance
Public Services
Social Media
Technology
Ratan Tata Innovation Hub
Skill Development
Caste Certificates

More Telugu News