Pawan Kalyan: పవన్ కల్యాణ్ శాఖకు జాతీయ అవార్డులు... సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!

జాతీయస్థాయిలో పలు పురస్కారాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని తమ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందని, పల్లెల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తోందని ఆయన అన్నారు. సుపరిపాలన, పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాలు వంటి ఐదు అంశాల్లో వచ్చిన ఈ అవార్డులు ప్రభుత్వ సుపరిపాలనకు అద్దం పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. అత్యుత్తమ విధానాలతో శాఖను ముందుకు నడిపిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు శాఖ అధికారులు, ఉద్యోగులకు చంద్రబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గ్రామ స్వరాజ్య స్థాపనలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ అవార్డులపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. తమ శాఖ వరుసగా రెండో ఏడాది జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా, మహిళలకు స్నేహపూర్వక వాతావరణం ఉన్న పంచాయతీగా తిరుపతి జిల్లా బొక్కసం పాలెంకు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం రావడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. సుపరిపాలనలో విశాఖ జిల్లా శృంగవరం, పేదరిక నిర్మూలనలో వైఎస్ఆర్ జిల్లా చెమ్ముళ్లపల్లి, మౌలిక వసతుల్లో ప్రకాశం జిల్లా గుండమల గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని వివరించారు. 

అలాగే, సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మండలం దేశంలోనే మూడో అత్యుత్తమ మండలంగా ఎంపికైందని పేర్కొన్నారు.
గత ఏడాది కూడా తమ శాఖ 4 అవార్డులు గెలుచుకుందని పవన్ గుర్తుచేశారు. ఈ పురస్కారాలు తమ బాధ్యతను మరింత పెంచాయన్నారు. గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డులు నిదర్శనమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Pawan Kalyan
Chandrababu Naidu
Andhra Pradesh
Panchayat Raj
Rural Development
National Awards
YSR district
Tirupati district
Kuppam
Narendra Modi

More Telugu News